నిన్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు జరగగా ఈ ఎన్నికల్లో పలువురు సినీ ప్రముఖులు ఓటు హక్కును వినియోగించుకోలేదనే సంగతి తెలిసిందే.రికార్డు స్థాయిలో పోలింగ్ జరగగా మొత్తం 665 ఓట్లు పోల్ అయ్యాయి.
పోలింగ్ మొదలైన రెండు గంటల్లోనే స్టార్ హీరోలు చిరంజీవి, పవన్ కళ్యాణ్ తో పాటు బాలకృష్ణ ఓటు హక్కును వినియోగించుకున్నారు.అయితే స్టార్ హీరోలుగా పాపులారిటీని సంపాదించుకున్న కొందరు సినీ ప్రముఖులు మాత్రం ఓటింగ్ కు దూరంగా ఉన్నారు.
టాలీవుడ్ స్టార్ హీరోలలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రభాస్, సూపర్ స్టార్ మహేష్ బాబు, వెంకటేష్, బన్నీ, నాగచైతన్య, రవితేజ, రానా నితిన్ ఓటింగ్ కు రాలేదు.హీరోయిన్లలో రకుల్ ప్రీత్ సింగ్, అనుష్క, సమంత, హన్సిక, త్రిష, ఇలియానా సైతం ఓటు హక్కును వినియోగించుకోలేదు.
కొంతమంది సెలబ్రిటీలు హైదరాబాద్ లోనే ఉన్నా ఓటు హక్కును వినియోగించుకోకపోవడం గమనార్హం.అయితే స్టార్ హీరోలు, హీరోయిన్లు ఓటింగ్ కు దూరంగా ఉండటానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
షూటింగ్ లతో బిజీగా ఉండటం వల్లే స్టార్ హీరోలు, హీరోయిన్లు ఓటు హక్కును వినియోగించుకోలేదని ఆయా హీరోల, హీరోయిన్ల అభిమానులు భావిస్తున్నారు.కొంతమంది వ్యక్తిగత కారణాల వల్ల ఓటుహక్కును వినియోగించుకోలేదని తెలుస్తోంది.విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ, వరుణ్ తేజ్, అల్లు శిరీష్, సుమంత్, శర్వానంద్, సుశాంత్, సత్యదేవ్, సునీల్ కూడా ఓటు వేయడానికి ఆసక్తి కనబర్చలేదు.
హొరాహోరీగా సాగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలలో మంచు విష్ణుకు అధ్యక్ష పీఠం దక్కింది. 107 ఓట్ల మెజారిటీతో గెలిచిన విష్ణుకు పలువురు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు.జెనీలియా, జయప్రద ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఓటుహక్కును వినియోగించుకోవడం గమనార్హం.
ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత నాగబాబు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.