అమెరికా అధ్యక్షుడిగా డెమొక్రాట్ నేత జో బైడెన్ ఎన్నికను ధ్రువీకరించడం కోసం జనవరి 6 (బుధవారం)న యూఎస్ కాంగ్రెస్.క్యాపిటల్ భవనంలో సమావేశమైంది.
ఈ సందర్భంగా ట్రంప్ ఇచ్చిన పిలుపుతో అప్పటికే వాషింగ్టన్ చేరుకున్న ఆయన మద్దతుదారులు.భవనంలోకి దూసుకెళ్లే ప్రయత్నం చేసి, అలజడి సృష్టించారు.
బారికేడ్లను దాటుకుని వచ్చి కిటికీలు, ఫర్నిచర్, అద్దాలు పగులగొట్టారు.వారిని శాంతింపజేసేందుకు తొలుత టియర్ గ్యాస్ ప్రదర్శించినప్పటికీ లాభం లేకపోయింది.
దీంతో తప్పనిసరి పరిస్ధితుల్లో పోలీసులు తూటాలకు పనిచెప్పడంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.అమెరికా చరిత్రలోనే మాయని మచ్చగా మిగిలిపోయిన ఈ ఘటనకు సంబంధించి ఎన్నో విచారణ కమీటీలు దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కమిటీ దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.జనవరి 6న వాషింగ్టన్లోని ఓ విలాసవంతమైన హోటల్ను ట్రంప్ సలహాదారులు వార్ రూమ్గా ఏర్పాటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది.
ట్రంప్ వ్యూహకర్త స్టీవ్ బానన్, లీగల్ కన్సల్టెంట్ రూడీ గిలియాని, జాన్ ఈస్ట్మన్లు వాషింగ్టన్లోని విలార్డ్ ఇంటర్ కాంటినెంటల్లోని సూట్ల నుంచి కార్యకలాపాలు నిర్వహించారని కాంగ్రెస్ కమిటీ ఆరోపిస్తోంది.గత వారం బన్నన్పై చేసిన కాంగ్రెస్ తీర్మానం ప్రకారం.
ఈ ముగ్గురు హోటల్ నుంచి నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్న వారితో టచ్లో వున్నారని కమిటీ సభ్యులు అనుమానిస్తున్నారు.
1847లో నిర్మించిన విలార్డ్ హోటల్ అమెరికాలోని పురాతన హోటల్స్లో ఒకటి.ఉన్నత సమాజానికి, రాజకీయ నాయకులు, అధికారులకు, వైట్హౌస్ను సందర్శించేవారికి ఈ హోటల్ కేంద్రంగా వుంది.అమెరికా అధ్యక్షులు, ఇతర రాజకీయ నాయకులను ప్రభావితం చేసేందుకు ఇక్కడి ప్రజలు విలార్డ్ లాబీల్లో సమావేశమయ్యేవారు.
ఈ ఏడాది ప్రారంభంలో ఇండిపెండెంట్ రీసెర్చర్ సేథ్ అబ్రమ్సన్ తన వెబ్సైట్ ‘‘ప్రూఫ్’’లో ట్రంప్పై బైడెన్ సాధించిన విజయాన్ని వ్యతిరేకిస్తున్న డజన్ల కోద్దీ వ్యక్తులు జనవరి 6 వరకు విలార్డ్లో బస చేశారని పలు డాక్యుమెంట్లు వుంచారు.
వీరిలో రాజకీయ వ్యూహకర్త రోజర్ స్టోన్, ఒకప్పటి ఆయన ప్రతినిధి జాసన్ మిల్లర్, ప్రచార సలహాదారు బోరిస్ ఎప్స్టెయిన్, న్యూయార్క్ నగర మాజీ పోలీస్ కమీషనర్ బెర్నార్డ్ కెరిక్ వంటి వారు వున్నారని అబ్రమ్సన్ సాక్ష్యాధారాలతో సహా బయటపెట్టారు.జనవరి 6 దాడిని దర్యాప్తు చేస్తున్న హౌస్ స్పెషల్ కమిటీ .ట్రంప్తో సహా వైట్హౌస్కు సన్నిహితంగా వున్న వ్యక్తులు కేపిటల్పై దాడిని ప్రేరేపించారా అన్న కోణంలో పరిశీలిస్తోంది.నిరసనకారుల ఆందోళన వల్ల బైడెన్ను విజేతగా నిర్ధారించడానికి ఉద్దేశించిన ఉమ్మడి సమావేశాన్ని గంటల పాటు నిలిపివేసిన సంగతి తెలిసిందే.