అబుదాబీలో స్థిరపడిన భారతీయ వ్యాపార దిగ్గజం ఎంఏ యూసుఫ్ సౌదీ అరేబియా గ్రీన్కార్డును అందుకున్న తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించాడు.ఈ మేరకు సోమవారం ఆయన కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.64 ఏళ్ల యూసుఫ్ అలీ ప్రఖ్యాత లూలూ గ్రూప్కు ఛైర్మన్గా వ్యవహరిస్తున్నారు.గతేడాది యూఏఈలోనే అత్యంత ధనవంతుడిగా ఫోర్బ్స్ మ్యాగజైన్ కథనాన్ని ప్రచురించిన సంగతి తెలిసిందే.
సౌదీ గ్రీన్ కార్డు పొందిన వారు ఎలాంటి స్పాన్సర్ లేకుండా సౌదీ అరేబియాలో నివసించడానికి, పని చేయడానికి, వ్యాపారం నిర్వహించుకోవడానికి, ఆస్తిని కలిగి ఉండటానికి వీలు కల్పిస్తుంది.సౌదీ ఆర్ధిక వ్యవస్థను మరింత పటిష్టం చేయడానికి విజన్ 2030 సంస్కరణల ప్రణాళికల్లో భాగంగా ఆ దేశ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ ప్రీమియం రెసిడెన్సీని ప్రవేశపెట్టారు.
యూసుఫ్ అలీ మాట్లాడుతూ… తన జీవితంలో స్పష్టంగా గర్వించదగిన క్షణమని ఇది తనకు మాత్రమే కాదని, మొత్తం ప్రవాస భారతీయ సమాజానికి దక్కిన గొప్ప గౌరవంగా అలీ అభివర్ణించారు.ఈ సందర్భంగా సౌదీ రాజు సల్మాన్, క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్, ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
విదేశీయుల శాశ్వత నివాసంపై సౌదీ తీసుకున్న చొరవ కారణంగా ప్రపంచంలోని పెట్టుబడులు, వ్యాపార కేంద్రాలలో ఒకటిగా ఈ దేశ ప్రతిష్ట మరింత పెరగడంతో పాటు కొత్త పెట్టుబడుదారులు సౌదీ అరేబియాపై దృష్టి పెట్టే అవకాశం ఉందని అలీ అన్నారు.
అనంతరం సౌదీ ప్రీమియం రెసిడెన్సీ సోమవారం ట్వీట్ చేస్తూ… యూసుఫ్ అలీ భారతదేశానికి చెందిన పెట్టుబడిదారని, సంస్కరణల కారణంగా సౌదీ అరేబియా పెట్టుబడులకు గమ్యస్థానంగా మారిందని తెలిపింది.
దేశ నిర్మాణ ప్రక్రియలో నిర్ణయాత్మక పాత్ర పోషించే క్రీడలు, కళలు, సంస్కృతితో సహా వివిధ రంగాలకు చెందిన ముఖ్య పెట్టుబడిదారులను, ప్రముఖ వ్యక్తులను ప్రీమియం రెసిడెన్సీ విధానంలో లక్ష్యంగా చేసుకున్నట్లు ఏజెన్సీ తెలిపింది.లూలూ గ్రూప్ సౌదీ అరేబియాలో 35కి పైగా హైపర్ మార్కెట్లు, సూపర్ మార్కెట్లను కలిగి ఉంది.ఇందులో ఆరామ్కో కమిషనరీలు, నేషనల్ గార్డ్స్, సూపర్ స్టోర్స్ ఉన్నాయి.భారతదేశంలోనూ యూసుఫ్ అలీ పెట్టుబడులు పెట్టి, మాతృభూమి రుణాన్ని తీర్చుకుంటున్నారు.