తాజాగా ఓ ప్రేమజంట వ్యవహారం వారి ఇరువురి కుటుంబ సభ్యుల మధ్య పెద్ద చిచ్చునే పెట్టింది.ఓ ప్రేమ జంట ఇంట్లో నుంచి పారిపోవడంతో యువకుడి ఇంటికి యువతి కుటుంబ సభ్యులు నిప్పుని అందించారు.
ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రంలో బెంగళూరు నగర జిల్లా పరిధిలో జరిగింది.జిల్లాలోని అనేకల్ తాలూకా లోని సజ్జాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన బుధవారం నాడు చోటు చేసుకుంది.
రాహుల్, రేఖ అనే ఇద్దరు దూరపు బంధువులు.వీరిద్దరు గత ఎనిమిది సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు.
ఈ విషయం కాస్త రాహుల్ ఇంటి కుటుంబ సభ్యులకు తెలిసిపోగా వారు తమ కొడుక్కి ఇచ్చి పెళ్లి చేయాలని రేఖ ఇంట్లోని సభ్యులను కోరారు.అయితే ఇందుకు అమ్మాయి కుటుంబ సభ్యులు అడ్డు చెప్పారు.
దీంతో అమ్మాయి తరపు పెద్దలు వారి పెళ్లికి నిరాకరిస్తున్నారని భావించి ఏప్రిల్ 1 తారీఖున ఇంటినుంచి ఎక్కడికో వెళ్ళిపోయారు.ఈ విషయాన్ని అమ్మాయి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు అందించారు.
కంప్లైంట్ ఇచ్చి వారం రోజులు గడుస్తున్నా ఎలాంటి పురోగతి ఈ కేసులో కనిపించలేదు.
అయితే అమ్మాయి ఆచూకీ తెలపాలని కోరుతూ అబ్బాయి ఇంటికి వెళ్లారు అమ్మాయి కుటుంబ సభ్యులు.
అయితే ఆ సమయంలో అబ్బాయి కుటుంబ సభ్యులు ఇంట్లో లేకపోవడంతో ఇంటికి బయట తాళం వేసి ఉండడం గ్రహించారు.దీంతో అమ్మాయి కుటుంబ సభ్యులు కోపోద్రిక్తులై అబ్బాయి ఇంటి లోకి పెట్రోల్ పోసి ఇంటికి నిప్పు అంటించారు.
దీంతో ఇంట్లో ఉన్న వస్తువులు అన్నీ అగ్నికి ఆహుతయ్యాయి.మంటల్లో కాలిపోతున్న ఇంటిని గుర్తించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వగా వెంటనే సంఘటనా స్థలానికి వచ్చి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి పూర్తి విచారణ చేపడుతున్నారు.