కరోనా విలయతాండవానికి భారతావని అల్లాడిపోతోంది.ఇప్పటికే చాప కింద నీరులా దేశం మొత్తం విస్తరించిన ఈ మహమ్మారి కోరల్లో చిక్కి లక్షలాది మంది విలవిలలాడిపోతున్నారు.
ప్రతిరోజూ లక్షల సంఖ్యలో కేసులు, వేలాది మరణాలతో దేశంలో హృదయ విదారకర సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి.నిన్న ఏకంగా 4 లక్షల మందికిపైగా పాజిటివ్గా తేలగా, మూడు వేల మందికి మించి ప్రాణాలు కోల్పోయారు.
దీంతో భారత్ను ఆదుకునేందుకు అంతర్జాతీయ సమాజం ముందుకొస్తోంది.ఇప్పటికే వివిధ దేశాల నుంచి ఆక్సిజన్, వైద్య సామాగ్రి, మందులు భారత్కు చేరుకున్నాయి.
రానున్న రోజుల్లో ఈ సాయం మరింత పెరిగే అవకాశం వుంది.
తాజాగా బ్రిటన్లోని ప్రవాస భారతీయులు కూడా మాతృదేశాన్ని ఆదుకునేందుకు సిద్ధమయ్యారు.
ఈ సంక్షోభ సమయంలో యూకేలోని కొన్ని భారతీయ సమాజాలు పలు విధాలుగా స్పందిస్తున్నాయి.వాయువ్య లండన్లోని వెంబ్లీలో ఉన్న ఒక హిందూ దేవాలయంలో బ్రిటిష్ ఇండియన్లు తమ సహచరుల కోసం సామూహిక ప్రార్థనలు జరుపుతున్నారు.
బ్రిటిష్ ఇండియన్స్ నిర్వహించిన మరో క్యాంపెయిన్ ‘గో ఫండ్ మి’కి కూడా భారీ స్థాయిలో స్పందన లభించింది.ముందుగా నిర్దేశించుకున్న లక్ష్యాన్ని దాటి ఒక్క రోజులోనే 16,00,000 పౌండ్లను (భారత కరెన్సీలో రూ.16.5 కోట్లు) సేకరించింది.
అటు ప్రిన్స్ చార్లెస్ ప్రారంభించిన బ్రిటిష్ ఏషియన్ ట్రస్ట్, ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లను కొనుగోలు చేసేందుకు ఫండ్ రైజింగ్కు పిలుపునిచ్చింది.దీనిలో భాగంగా లండన్లోని శ్రీ స్వామి నారాయణ మందిరం వద్ద బైక్థాన్ కార్యక్రమం ద్వారా నిధుల సేకరణ చేయాలని నిర్ణయించింది.
లండన్ నుంచి ఢిల్లీకి వున్న దూరం 7,600 కిలోమీటర్లు.అయితే ఈ దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన స్టేషనరీ బైక్స్ను తొక్కుతూ ఈ దూరాన్ని వాలంటీర్లు 48 గంటల్లో పూర్తి చేయాలి.
‘‘సైకిల్ టూ సేవ్ లైవ్స్’’ పేరిట ఏర్పాటు చేసిన ఈ ఫండ్ రైజింగ్ కార్యక్రమం ద్వారా 5 లక్షల పౌండ్లు (6,90,000 యూఎస్ డాలర్లు) సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.ఈ నిధుల ద్వారా ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను కొనుగోలు చేసి వీలైనంత త్వరగా భారత్కు పంపాలనే ఆలోచనలో ఉన్నారు.
ఇందుకోసం నిర్వాహకులు ఆలయం ముందు 12 బైకులను ఏర్పాటు చేశారు.లీసెస్టర్, చిగ్వెల్లోని దేవాలయాల వద్ద ప్రచారం చేయడంతో దాదాపు 750 మంది వాలంటీర్లు బైక్థాన్లో పాల్గొనేందుకు ఆసక్తి చూపారు.ప్రతి వాలంటీర్కు బైక్ను నడిపేందుకు ఒక గంట సమయం ఇస్తారు.ఇందులో 50 నిమిషాల పాటు వారు తొక్కిన కిలోమీటర్లను లెక్కిస్తారు.మిగిలిన 10 నిమిషాల్లో వారు బైక్ను శానిటైజ్ చేసి తిరిగి నిర్వాహకులకు అప్పగించాల్సి వుంటుంది.కోవిడ్పై పోరాటంలో మీరు ఒంటరిగా లేరు.
భౌగోళికంగా తాము వేల కిలోమీటర్ల దూరంలో వుండొచ్చు కానీ, ఎల్లప్పుడూ భారతీయుల వెంటే వున్నామన్న సందేశాన్ని ఇచ్చేందుకు ఈ కార్యక్రమాన్ని ఎంచుకున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.