ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెడుతూ జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ప్రతిపక్షాలు ఏ విధంగా గా స్పందించాలో అర్థంకాని పరిస్థితిలో ఉన్నాయి.టిడిపి ప్రభుత్వంలో ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టామని, ఆ ఘనత తమకే దక్కుతుందని ఆ పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నాఋ.
తాజాగా ఇదే అంశంపై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ కూడా స్పందించారు.తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం కి వ్యతిరేకం కాదని, కానీ మాతృభాష లేకుండా విద్యా విధానాన్ని కొనసాగించడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని చెప్పుకొచ్చారు.
అలాగే టీడీపీ అధికారంలో ఉండగా మున్సిపల్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టామని లోకేష్ చెప్పుకొచ్చారు.అయితే వైసీపీ ప్రభుత్వం బలవంతంగా ఇంగ్లీష్ మీడియాన్ని పిల్లలపై రుద్దుతోందన్నారు.
ఇంగ్లీష్ మీడియం చదువుకోవడం పిల్లలకు పూర్తిస్థాయిలో అంగీకారమో కాదో తెలుసుకోకుండానే వైసీపీ ప్రభుత్వం జీవో జారీ చేయడం దారుణం అన్నారు.తెలుగు భాష రాకపోతే ఎంత ఇబ్బంది పడాల్సి వస్తుందో తనకు బాగా తెలుసునని లోకేష్ అన్నారు.
తాను విదేశాల్లో చదువుకోవడం వల్ల తెలుగు భాషను ఇప్పటికీ పెద్దగా నేర్చుకోలేక ఇబ్బందిపడుతున్నానని లోకేష్ తన బాధను వ్యక్తం చేశారు.పొరపాటున ఎప్పుడైనా ఒక పదం తప్పు చదివితే దాన్ని హైలెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారని లోకేష్ మండిపడ్డారు.
అలాంటి పరిస్థితి విద్యార్థులకు రాకూడదని ముందుగా వైసీపీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం అని లోకేష్ చెప్పుకొచ్చారు.