భర్తను చంపిన కేసులో యెమెన్లో మరణశిక్షకు గురైన భారతీయ నర్సు నిమిషప్రియకు సాయం చేసేందుకు కేరళకు చెందిన ఎన్ఆర్ఐ సంస్థ ‘‘లోకా కేరళ సభ’’ రంగంలోకి దిగింది.దీనిలో భాగంగా వివిధ దేశాలల్లో నివసిస్తున్న 50 మంది సభ్యులతో నిమిష ప్రియకు సాయం చేసేందుకు గాను ‘‘ సేవ్ నిమిషా’’ పేరుతో అంతర్జాతీయ కార్యాచరణ మండలిని ఏర్పాటు చేసింది.
ఈ కేసులో 30 ఏళ్ల నిమిష ప్రియకు విధించిన మరణశిక్షను యెమెన్ అత్యున్నత న్యాయస్థానం సమర్ధించింది.2017 నుంచి జైలు శిక్ష అనుభవిస్తున్న నిమిషప్రియకు కేసు విచారణ సమయంలో ఎటువంటి చట్టపరమైన సాయం అందకపోవడం వల్లే మరణశిక్ష పడిందని కేరళలోని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.
మరోవైపు నిమిషాకు సాయం చేసేందుకు ఏర్పాటు చేసిన యాక్షన్ కౌన్సిల్ యెమెన్లో ఆమెకు న్యాయ సహాయం చేస్తుంది.దీనితో పాటు నిమిష చేతిలో హత్యకు గురైన ఆమె భర్త కుటుంబసభ్యులతో చర్చలు జరిపి నష్టపరిహారం ద్వారా క్షమాభిక్ష లభించేలా కృషి చేయనుంది.
ఈ యాక్షన్ కౌన్సిల్లో ఎంపీ రెమ్యా హరిదాస్, ఎంఎల్ఏలు కే బాబు, కేవీ అబ్ధుల్ ఖాదర్తో పలువురు ప్రముఖులు ఉన్నారు.వీరు యెమెన్లో నిమిషాప్రియతో టచ్లో ఉన్న సామాజిక కార్యకర్తలతో నేరుగా సంప్రదింపులు జరుపుతారు.
కేరళలోని పాలక్కాడ్కు చెందిన నిమిషప్రియ నర్సింగ్లో శిక్షణ పూర్తి చేశారు.ఆమెకు టామీ థామస్తో 2011లో వివాహం జరిగింది.భార్యాభర్తలిద్దరూ ఆ తర్వాత యెమెన్ వెళ్లి అక్కడ వేరు వేరు ఉద్యోగాల్లో స్థిరపడ్డారు.ఈ దంపతులకి ఐదేళ్ల కుమార్తె ఉంది.ఇదే సమయంలో నిమిష ప్రియకు తలాల్ అబ్దు మహీద్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు.భార్య తీరు నచ్చని టామీ, తన కుమార్తెతో కలిసి భారతదేశానికి వచ్చేశాడు.
కానీ నిమిష మాత్రం అక్కడే ఉండిపోయింది.
అనంతరం మహీద్ సాయంతో సనాలో ఓ క్లినిక్ ఏర్పాటు చేసింది.
ఈ క్రమంలో తనను పెళ్లి చేసుకోవాలని మహీద్ కోరాడు.అతనికి అప్పటికే వివాహం జరిగి ఒక బిడ్డ కూడా ఉన్నాడు.
అయినప్పటికీ తలాల్ను ఆమె పెళ్లిచేసుకుంది.అయితే మహీద్ … నిమిష సంపాదనతో జల్సాలు చేయడం మొదలుపెట్టాడు.
డ్రగ్స్కి అలవాటు పడి ఆమెను చిత్రహింసలు పెట్టేవాడు.అతని వేధింపులు భరించలేక నిమిషప్రియ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది.
దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మహీద్ ఇంటికి వచ్చిన తర్వాత మరింతగా రెచ్చిపోయాడు.
దీంతో భర్త అడ్డు తొలగించుకోవాలని భావించిన నిమిషప్రియ 2017లో మరో నర్స్తో కలిసి మహీద్కి అధిక మోతాదులో మత్తుమందు ఇచ్చింది.
అనంతరం అతని మృతదేహాన్ని 110 ముక్కలు చేసి బస్తాల్లో కుక్కి ఎక్కడ పడితే అక్కడ విసిరి పారేసింది.ఈ ఘటన యెమెన్తో పాటు భారత్లోనూ సంచలనం సృష్టించింది.2018లో ఎట్టకేలకు నిమిషను పట్టుకున్న పోలీసులు కోర్టు ముందు హాజరుపరిచారు.ఈ నేరానికి గాను నిమిషకు మరణశిక్ష, ఆమెకు సాయపడిన మరో నర్సుకు జీవితఖైదు విధించించింది న్యాయస్థానం.కాగా హత్యకు గురైన మహీద్ కుటుంబం తమకు నష్ట పరిహారంగా రూ.70 లక్షలు ఇస్తే నిమిషప్రియకు క్షమాభిక్ష పెడతామని ప్రకటించింది
.