మార్చి 20వ తేదీ నుంచి సుదీర్ఘంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలవుతున్నాయి.ఇప్పుడిప్పుడే లాక్ డౌన్ నిబంధనల్లో కొన్ని సడలింపులు ఇచ్చారు.
రోజురోజుకు కేసుల సంఖ్య తీవ్రంగా పెరుగుతుండడం, పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఆందోళనలో ఉన్నారు.ఇప్పటికే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య దేశవ్యాప్తంగా 50 వేలు దాటింది.
మే 17వ తేదీ కి కేంద్రం విధించిన లాక్ డౌన్ నిబంధన సైతం పూర్తవుతుంది.అయితే, ఇక్కడితో లాక్ డౌన్ ముగుస్తోందా లేక మరికొంత కాలం పొడిగిస్తారా అనే సందేహం అందరిలోనూ వ్యక్తమవుతోంది.
మూడోసారి లాక్ డౌన్ నిబంధనలు పొడిగించిన సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ బయటకు రాలేదు.
ఆ ప్రకటనను కేంద్ర హోంశాఖ ద్వారా మాత్రమే చేయించారు.
ఆ సమయంలోనే లాక్ డౌన్ నిబంధనల్లో కొన్ని మినహాయింపులు ఇచ్చారు.వాటిలో ప్రధానంగా ఆరెంజ్, గ్రీన్ జోన్లలో మద్యం అమ్మకాలకు అనుమతి ఇచ్చారు.దీంతో చాలా రాష్ట్రాలు మద్యం షాపులను తెరిచాయి.40 రోజులుగా ఆదాయం లేకపోవడంతో మద్యం అమ్మకాల ద్వారా ఆదాయం రాబట్టుకోవాలని చాలా రాష్ట్రాలు భావించాయి.అయితే మద్యం దుకాణాల వద్ద పెద్ద ఎత్తున ప్రజలు గుమిగూడడం, అక్కడ నిబంధనలు అమలు కాకపోవడం వంటి కారణాలతో కేంద్రం మద్యం అమ్మకాలపై పూర్తి స్థాయిలో నిఘా ఏర్పాటు చేసింది.ఈ నిఘా సమాచారం ఎప్పటికప్పుడు వివిధ రాష్ట్రాల ఇంటెలిజెన్స్ ద్వారా తెప్పించుకుంటోంది.
మద్యం దుకాణాల ద్వారా కరోనా వ్యాప్తి చెందుతున్నట్లు రిపోర్టు వస్తే వెంటనే మద్యం అమ్మకాలను లాక్ డౌన్ మినహాయింపులు నుంచి తీసి వేస్తామని కేంద్రం హెచ్చరికలు చేస్తోంది.ఈ మేరకు సమగ్ర వివరాలను నిఘా విభాగం ద్వారా కేంద్రం ఎప్పటికప్పుడు తెప్పించుకుంటూ ఒక అంచనాకు వస్తోంది.కేంద్ర బృందాలు కూడా అన్ని రాష్ట్రాల్లోనూ పర్యటిస్తూ, మద్యం అమ్మకాలకు సంబంధించి పూర్తిస్థాయిలో నివేదికలు చెప్పించుకుని ప్రధాని మోదీ కి పంపిస్తున్నారు.ఈ నివేదికను ఇప్పటికే పరిశీలించిన మోదీ కరోనా వైరస్ ఇప్పట్లో కట్టడి కాదని, మరోసారి అంటే మరో రెండు వారాల పాటు పొడిగించాలనే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది.
అదే కనుక జరిగితే కేంద్రం పై ప్రజల్లో మరింత ఆగ్రహం పెరిగిపోతుంది.ఎందుకంటే ఇప్పటికే ఉపాధి కోల్పోయి అనేక మంది ఆకలితో అలమటిస్తున్నారు.
ఇప్పుడు మరి కొంతకాలం ఈ నిబంధనలు పొడిగిస్తే కరోనా ను మించి మరణాలు దేశవ్యాప్తంగా నమోదయ్యే అవకాశం లేకపోలేదని నిపుణులు సైతం అభిప్రాయపడుతున్నారు.మరి మోదీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి
.