కరోనా వైరస్ మహమ్మారి నుండి దేశ ప్రజలను కాపాడేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా మార్చి 25 నుండి లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే.ఈ లాక్డౌన్ తొలుత 21 రోజుల వరకే ఉంటుందని అందరూ అనుకున్నారు.
కానీ పలు దశలవారీగా ఈ లాక్డౌన్ను పొడిగిస్తూ దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కట్టడికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.అయితే కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతుండటంతో ప్రస్తుతం 4వ దశ లాక్డౌన్ మే 31 వరకు విధించింది.
అయితే రేపటితో లాక్డౌన్ 4.0 ముగుస్తుండటంతో ప్రభుత్వం జూన్ 1 నుండి ఏం చేయబోతుందనే సందేహం అందరిలో నెలకొంది.కాగా ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం తాజాగా క్లారిటీ ఇచ్చింది.కరోనా కేసులు ఉన్న కంటెయిన్మెంట్ జోన్లకు ఏకంగా జూన్ 30వ తేదీ వరకు లాక్డౌన్ పొడిగిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది.
కరోనా కేసులు ఎక్కువగా ఉన్న కంటెయిన్మెంట్ జోన్లకు మినహా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున సడలింపులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
ఈ మేరకు సరికొత్త గైడ్లైన్స్ను కేంద్రం ప్రవేశపెట్టింది.
జూన్ 8వ తేదీ నుండి ప్రార్ధనా మందిరాలు, హోటళ్లు, రెస్టారెంట్లు, మాల్స్ను తెరిచేందుకు కేంద్రం అనుమతిని ఇచ్చింది.అయితే సినిమా థియేటర్లు, స్కూళ్లు, కాలేజీలకు సంబంధించిన సడలింపులను రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించాక కేంద్రం నిర్ణయం తీసుకోనుంది.
ఈ లాక్డౌన్ పొడిగింపు జూన్ 8వ తేదీ నుండి జూన్ 30 వరకు ఉండనుండగా, రాత్రి 9 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు దేశవ్యాప్తంగా కర్ఫ్యూ ఉండనుంది.ఇలా మరిన్ని సడలింపులతో లాక్డౌన్ను పొడిగిస్తున్నట్లు కేంద్రం తాజాగా ఆదేశాలను జారీ చేసింది.