దేశంలో కరోనా మహమ్మారి శరవేగంగా విస్తరిస్తుంది.అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం కరోనా విషయంలో ప్రజలదే పూర్తి బాధ్యత అని లాక్ డౌన్ సడలింపు ఇచ్చారు.
ఓ విధంగా చెప్పాలంటే లాక్ డౌన్ పూర్తిగా తొలగించారని చెప్పాలి.అయితే ఇప్పటికే కరోనా కేసు విషయంలో ప్రపంచంలో ఆరో స్థానానికి వచ్చేసిన ఇండియాలో బాధితుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది.
కరోనాని కట్టడి చేయడానికి ఇప్పటివరకు ప్రభుత్వం తీసుకున్న చర్యలన్ని వృథా ప్రయాసగా మారినట్లే కనిపిస్తున్నాయి.లాక్ డౌన్ సడలింపుల నేపథ్యంలో భారత్ కు డబ్ల్యూహెచ్ఓ హెచ్చరికలు జారీ చేసింది.
భారత్ లో పెరుగుతున్న కరోనా కేసులు ఇప్పటివరకు పరిస్థితి అదుపులోనే ఉందన్న డబ్ల్యూహెచ్ఓవైరస్ కట్టడి ప్రజల చేతుల్లోనే ఉందని వ్యాఖ్యలు చేసింది.
భారత్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ వైరస్ విజృంభిస్తోంది అనే స్థాయిలో మాత్రం పరిస్థితి లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది.
అయితే, లాక్ డౌన్ సడలింపులు ఇస్తున్న నేపథ్యంలో ఏ సమయంలోనైనా కరోనా వైరస్ విరుచుకుపడే అవకాశముందని హెచ్చరించింది.తొలినాళ్లలో భారత్ తీసుకున్న చర్యలతో వైరస్ వ్యాప్తి కట్టడి జరిగిందని, కానీ దేశంలో క్రమంగా సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయని, ఇలాంటి తరుణంలోనే కరోనా వైరస్ తీవ్ర రూపు దాల్చుతుందని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ మైకేల్ ర్యాన్ తెలిపారు.
ఇండియాలో జనసాంద్రత ఎక్కువ కావడం, ప్రజలు పనుల కోసం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లడం ఈ వైరస్ వ్యాప్తికి కారణంగా ఆయన పేర్కొన్నారు.కరోనా వైరస్ నుంచి బయటపడాలంటే అది పూర్తిగా ప్రజల చేతుల్లోనే ఉందని స్పష్టం చేశారు.