దేశవ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ నిబంధనలు పూర్తిస్థాయిలో ఎప్పుడు ఎత్తి వేస్తారా అనే సందేహం ప్రతి ఒక్కరిలోనూ ఉంది.సుదీర్ఘకాలంగా లాక్ డౌన్ విధించడం కారణంగా సామాన్య ప్రజలు ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొంటూ, అష్టకష్టాలు పడుతున్నారు.
ఇప్పటికే మూడుసార్లు లాక్ డౌన్ పొడిగిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ కీలక నిర్ణయం తీసుకోవడం దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు సైతం కఠినంగా ఈ నిబంధనలు అమలు చేస్తూ వస్తుండడంతో ప్రజల బాధ అంతా ఇంతా కాదు.కరోనా పూర్తిస్థాయిలో కట్టడి కాకపోవడం, దానికి సంబంధించిన వాక్సిన్ ఇప్పటి వరకు అందుబాటులోకి రాకపోవడంతో మరి కొంత కాలం పాటు కారోనాతో కలిసి సహజీవనం చేయాల్సిందేనని అందరూ దాదాపు ఫిక్స్ అయిపోయారు.
అన్ని దేశాలు ఇదే అభిప్రాయంతో ఉండడంతో క్రమక్రమంగా లాక్ డౌన్ ఎత్తివేయాలనే ఆలోచనలో ప్రధాని మోదీ ఉన్నారు.ఇప్పటికి ఈ నిబంధనల్లో కొన్ని సడలింపు ఇచ్చారు.
అయితే మరికొన్ని విషయాల్లోనూ లాక్ డౌన్ పూర్తిగా ఎత్తివేయాలని ప్రధాని ఆలోచిస్తున్నారు.
ఇప్పటికే రెడ్ జోన్ లలో లిక్కర్ షాపులను తెరిచేందుకు సైతం అనుమతి ఇచ్చారు.విద్యాలయాలు, ప్రార్థన మందిరాలు, సినిమా హాళ్లు, వంటి వాటికి మాత్రం అనుమతి ఇవ్వలేదు.మిగతా వాటిలో మినహాయింపులు ఇచ్చినా, సినిమా హాళ్లు, హోటళ్లు పూర్తిస్థాయిలో తెరుచుకునేందుకు మరి కొన్ని నెలల సమయం పట్టే అవకాశం ఉంది.
ఎందుకంటే సినిమా హాళ్లు వైరస్ వ్యాప్తికి ఎక్కువ కారకాలు అవుతాయని ప్రభుత్వం భావిస్తోంది.అలాగే సోషల్ డిస్టెన్స్ ను పాటించడం, ఇక్కడ సాధ్యం కాదు.దీంతో సినిమా థియేటర్లు , హోటళ్ల తెరిచే ఆలోచనలో ప్రభుత్వం లేదు.ఇప్పటికే లాక్ డౌన్ మినహాయింపులు కారణంగా గ్రీన్, ఆరెంజ్ జోన్ లలో యధావిధిగా ప్రజల జీవనం మొదలైంది.
అలాగే మాస్కులు ధరిస్తూ, చేతులను శుభ్రం చేసుకుంటూ జనాలు ఈ విషయంలో బాగానే చైతన్యవంతం అయ్యారు.దీంతో ప్రజా రవాణాను పూర్తిస్థాయిలో అనుమతించాలనే ఉద్దేశంలో కేంద్రం ఉంది.
ఈ మేరకు ఇప్పటికే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూడా ప్రకటన చేశారు .లాక్ డౌన్ కారణంగా గత 40 రోజులుగా ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు క్యాబ్ లు, ఆటోలు రోడ్లపైకి రావడం లేదు.దీంతో వీటిపై ఆధారపడిన కోట్లాది కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.అందుకే మే 17వ తేదీ నుంచి ఇచ్చే మినహాయింపుల్లో ప్రజారవాణా ఉండే అవకాశం కనిపిస్తోంది.
దీని కోసం కేంద్రం మార్గదర్శకాలను రూపొందించింది.ముఖ్యంగా జన సామర్థ్యం ఎక్కువగా ఉండే వాటి విషయాల్లో తప్ప మిగతా అన్ని కార్యకలాపాలు యధావిధిగా కొనసాగే అవకాశం కనిపిస్తోంది.
నిబంధనలు పూర్తిగా ఎత్తివేయాలంటూ పలు రాష్ట్రాలు కేంద్రానికి విజ్ఞప్తులు చేస్తూనే ఉన్నాయి.లాక్ డౌన్ కారణంగా పూర్తి స్థాయిలో ప్రభుత్వ ఆదాయానికి గండి పడిందని, జీతాలు ఇచ్చే పరిస్థితి లేకపోవడం, కనీసం ప్రభుత్వాన్ని ముందుకు నడిపించే అవకాశం కూడా లేకపోవడంతో గగ్గోలు పెడుతున్నాయి.ఈ నేపథ్యంలోనే మే 17వ తేదీ నుంచి యధావిధిగా కార్యకలాపాలు సాగించేందుకు కేంద్రం అనుమతి ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.