ప్రముఖ క్రీడాకారుడు, ఫుట్ బాల్ ఆటగాడు అయినటువంటి ‘లియోనెల్ మెస్సీ’ తెలియని క్రీడాభిమానులు ఉండరంటే నమ్మశక్యం కాదేమో.అర్జెంటీనా దేశానికి చెందిన ఈ ప్రతిభావంతుడికి ప్రపంచ వ్యాప్తంగా కూడా మంచి గుర్తింపు ఉంది.
ఇక ఈయన బార్సిలోనా క్లబ్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం అందరికి తెలిసినదే.కానీ, ఇటీవల ఇతగాడు తన జట్టును వదిలి పెడుతున్నట్లు ప్రకటించాడు.
మెస్సీ కాంట్రాక్ట్ ఆ జట్టుతో వచ్చే సంవత్సరంతో ముగుస్తుంది.అయితే, అతను ఏడాది ముందుగానే ఆ జట్టు నుండి వీడాలనుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇందుకు సంబంధించి అసలు విషయం ఏమిటంటే…
ప్రస్తుతం జరుగుతున్న ఛాంపియన్స్ లీగ్ క్వార్టర్ ఫైనల్స్లో ‘బేయర్న్ మ్యూనిచ్’ చేతిలో బార్సిలోనా ఏకంగా 8 – 2 తేడాతో చిత్తుగా ఓడి పోయింది.ఇక ఇది మెస్సీ క్రీడా జీవితంలో అత్యంత ఘోర పరాభవం.
ఈ మ్యాచ్ ఓటమి కారణంగానే ఇతగాడు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.కానీ ఆ జట్టు నుండి బయటకు వచ్చేయాలన్న మెస్సీకి, బార్సిలోనా కాస్త గట్టిగానే షాక్ ఇచ్చింది.
ఎందుకంటే.ఒప్పందంలో ఉన్న నియమ నిబంధనల ప్రకారం, మెస్సీ ఆ జట్టును వదిలి పెట్టాలంటే 700 మిలియన్ యూరోలు (6 వేల కోట్లు) చెల్లించాలని, అప్పుడే తాము మెస్సీతో ఉన్న కాంట్రాక్టును పూర్తిగా రద్దు చేస్తామని బార్సిలోనా కుండ బద్దలు చేసి మరీ చెప్పింది.ఇక దాంతో మెస్సీ మెత్తబడ్డట్టు వార్తలు వినిపిస్తున్నాయి.బార్సిలోనా తోనే తాను కంటిన్యూ అవుతానన్నట్టు, మిగిలి ఉన్న ఏడాది కాంట్రాక్టు వరకు పూర్తిగా ఆ జట్టుకోసం ఆడతానన్నట్టు ప్రకటించినట్లు తెలుస్తోంది.