మనకు ఎవరైనా పడకపోతే లేదా వారితో తగాదా పెట్టుకుంటే ‘నీకు సిగ్గు లేదా? శరం లేదా’ అని తిడుతుంటాం.ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నుంచి బహిష్కరణకు గురైన సీనియర్ నాయకుడు, పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరైన ప్రశాంత్ భూషణ్ కూడా ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను అలాగే తిట్టారు.
ప్రశాంత్ భూషణ్ డిల్లీలో పేరు మోసిన న్యాయవాది.చాలాకాలం కేజ్రీవాల్తో కలిసి ఉద్యమించారు.
ఆప్ స్థాపనలో పాలుపంచుకున్నారు.కాని విభేదాలు రావడంతో ప్రశాంత్ భూషణ్ పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు.ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిని తిట్టడానికి కారణం ఏమిటంటే….’యోగేంద్ర యాదవ్తో (ఈయన్ని కూడా బహిష్కరించారు) మీరు తిరిగి పార్టీలోకి వస్తే ఆనందిస్తాను’ అని కేజ్రీవాల్ అన్నారు.దీంతో ప్రశాంత్ భూషణ్కు ఒళ్లు మండింది.‘నీకు సిగ్గు శరం లేవా? పార్టీలోకి మళ్లీ రమ్మని పిలవడానికి?’ ట్విట్టర్లో తిట్టారు.పార్టీ నేషనల్ కౌన్సిలింగ్ సమావేశంలో తమను తిట్టి , భౌతిక దాడులు కూడా చేసి ఏం మొహం పెట్టుకొని రమ్మంటున్నావ్? అని ప్రశ్నించారు.ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర యాదవ్ ‘ఆప్’ నుంచి బయటకు వచ్చాక ‘స్వరాజ్ అభియాన్’ అనే పార్టీ పెట్టారు.
ఈ ఇద్దరు నాయకులు తిరిగి ఆప్లోకి వస్తే తాను సంతోషిస్తానని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఒక టీవీ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.