ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ పట్నం లో చోటుచేసుకున్న గ్యాస్ లీక్ ఘటన 36 ఏళ్ల క్రితం మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో చోటుచేసుకున్న దుర్ఘటన ను తలపించేలా చేసింది.విశాఖపట్నంలో గురువారం వేకువజామున ఎల్జీ పాలిమర్స్ రసాయన పరిశ్రమల నుంచి లీక్ ఆయిన గ్యాస్ వల్ల దాదాపు 5 వేలమంది పై దీని ప్రభావం చూపింది.
అయితే ఈ ఘటనలో ఇప్పటికే 8 మంది మృత్యువాత పడగా పలువురు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోవడం తో అక్కడి పరిస్థితి భయానకంగా మారింది.గురువారం ఉదయం నిద్ర నుంచి లేస్తూనే ఈ ప్రమాద వార్త గురించి విని తెలుగు ప్రజలు ఉలిక్కిపడ్డారు.సుమారు 36 ఏళ్ల కింద మధ్యప్రదేశ్లోని భోపాల్లో ఇలాంటి ఘటనే చోటుచేసుకున్న విషయం తెలిసిందే.1984 డిసెంబరు 2న అర్ధరాత్రి భోపాల్లో యూనియన్ కార్బైడ్ పరిశ్రమ నుంచి విషవాయువులు వెలవడ్డాయి.ఈ ప్రమాదం వేలాది మందిని పొట్టనపెట్టుకుంది.ప్రపంచంలో ఇప్పటివరకు సంభవించిన పారిశ్రామిక ప్రమాదాల్లో ఇది అత్యంత భయానకమైనది చెప్పాలి. ఈ ప్రమాదంలో వెలువడిన 40 టన్నుల విషవాయువుల తీవ్రత మూడు రోజుల పాటు కొనసాగడం తో సుమారు 10 వేల మందిని పొట్టనపెట్టుకుంది.అత్యంత భయానకమైన ఈ భోపాల్ ఘటన కారణంగా నేటివరకు 25 వేల మందికి పైగా మృత్యువాత పడ్డారని ఒక అంచనా.
ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 5 లక్షల మంది జీవనంపై ఈ ప్రమాదం పెను ప్రభావం చూపించింది.ఈ దుర్ఘటనతో భోపాల్ నగరంలో మూడొంతుల భూభాగం విషతుల్యమైపోయింది.
గర్భస్థ శిశువులు కూడా తీవ్రంగా ప్రభావితమయ్యారంటే ఈ ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో కొనసాగిందో అర్థం చేసుకోవచ్చు.వారంతా శారీరక, మానసిక వికలాంగులయ్యారు.
పరిసర ప్రాంతాల్లో కిలోమీటర్ల భూగర్భ జలాలు కలుషితమయ్యాయి.ఇంతటి విపత్తు సృష్టించిన భోపాల్ ఘటన ను తలపించేలా విశాఖ లో చోటుచేసుకోవడం అందరినీ కలచివేసింది.
అయితే వందలాది పశువులు ఈ గ్యాస్ లీక్ అవ్వడం వల్ల ఇప్పటికే చనిపోయినట్టు తెలుస్తోంది.అలానే చెట్ల ఆకుల రంగు కూడా పూర్తిగా మారిపోయింది.
మరోపక్క ఈ కంపెనీనుంచి గ్యాస్ లీక్ కావడంపై స్థానికులు మండిపడుతున్నారు.కంపెనీ ఎలాంటి సేఫ్టీ తీసుకోలేదని, ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదని స్థానికులు వాపోతున్నారు.
ఇక ఈ కంపెనీ నుంచి లీకైన ఈ గ్యాస్ ప్రజలపై షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ ప్రభావం చూపించే అవకాశం ఉన్నట్టుగా నిపుణులు చెప్తున్నారు.కళ్ళు మంటలు, చర్మంపై దద్దుర్లు, శ్వాస తీసుకోవడంపై ఇబ్బందులు, ఉదరసంబంధమైన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.ఇక లాంగ్ టర్మ్ విషయానికి వస్తే నాడి వ్యవస్థపైనా, మూత్రపిండాలపైనా దీని ప్రభావం ఉంటుంది.అదే విధంగా తలనొప్పి, డిప్రెషన్, బలహీనత, క్యాన్సర్ వంటివి వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.