కరోనా ఉధృతి దేశవ్యాప్తంగా పెరిగిపోతుండటంతో కేంద్రం తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.కేంద్రం ముందుచూపుతో వ్యవహరించకపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తిందని దేశవ్యాప్తంగానే కాకుండా, ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
దీనికితోడు పూర్తిగా రాష్ట్రాలదే బాధ్యత అన్నట్లుగా కేంద్రం వ్యవహరిస్తుండడం, దేశవ్యాప్తంగా పరిస్థితి చేయి దాటి పోతున్నా ఏమి చేయలేనట్లుగా వ్యవహరిస్తుండడంతో రాష్ట్రాలు ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొంతున్నాయి.ఆక్సిజన్ కొరతతో పాటు, మరెన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.
ఇక వ్యాక్సినేషన్ ప్రక్రియ కేంద్రం చేతిలో ఉండడంతో, ఆయా రాష్ట్రాలకు తగినంత స్థాయిలో ఈ వ్యాక్సిన్ ను సరఫరా చేయాలనే డిమాండ్ పెరిగిపోతోంది.తాజాగా దేశవ్యాప్తంగా ప్రజలందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ చేపట్టాలని కోరుతూ నలుగురు ముఖ్యమంత్రులతో కూడిన పన్నెండు ప్రతిపక్ష పార్టీ ల నేతలు లేఖ రాశారు.
ఈ లేఖలో తొమ్మిది ప్రధాన డిమాండ్లను ఉంచారు.కాంగ్రెస్ అధినేత్రి సోనియా, మాజీ ప్రధాని దేవెగౌడ ,ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మహారాష్ట్ర సీఎం, శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే, పశ్చిమ బెంగాల్ సీఎం టిఎంసి అధినేత మమతా బెనర్జీ, తమిళనాడు సీఎం డీఎంకే అధినేత ఎంకె స్టాలిన్, జార్ఖండ్ ముఖ్యమంత్రి, జెఎంఎం అధినేత హేమంత్ సోరెన్ , నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా, సమాజ్ వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, సిపిఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి సంతకాలు చేశారు.ఈ సందర్భంగా తొమ్మిది డిమాండ్లను వారు ప్రధానంగా తమ లేఖలో పేర్కొన్నారు.
- 1.దేశ విదేశాల నుంచి కేంద్ర ప్రభుత్వం కరోనా వ్యాక్సిన్లను సేకరించాలి.
- 2.దేశవ్యాప్తంగా అందరికీ ఉచిత వ్యాక్సిన్ అందించే కార్యక్రమాన్ని తక్షణమే చేపట్టాలి.
- 3.తప్పనిసరి లైసెన్సింగ్ నిబంధనలు అమలు చేసి దేశీయంగా వ్యాక్సిన్ అందించే కార్యక్రమాన్ని వెంటనే ప్రారంభించాలి.
- 4.బడ్జెట్లో కేటాయించిన 35 వేల కోట్లు ఖర్చు చేయాలి.
- 5.సెంట్రల్ విస్టా నిర్మాణం తక్షణమే నిలిపివేయాలి.
- 6.లెక్కా పత్రం లేని పిఎం కేర్స్ ఫండ్ లో డబ్బు కరోనా వ్యాక్సిన్, ఆక్సిజన్, వైద్య పరికరాల కొనుగోలుకు విడుదల చేయాలి.
- 7.ఉద్యోగం లేని వారికి నెలకు 6000 ఇవ్వాలి.
- 8.ప్రస్తుతం గోదాముల్లో కోటి టన్నుల తిండి గింజల నిలువ ఉన్నందున వెంటనే వాటిని పేదలకు ఉచితంగా పంచి పెట్టాలి.
- 9.కొత్త సాగు చట్టాలను రద్దు చేసి, ప్రస్తుత కరోనా సమయంలో ఆందోళన చేస్తున్న రైతుల ప్రాణాలను కాపాడాలి అనే డిమాండ్లతో కూడిన లేఖను ప్రధానికి రాసి ఆయనపై ఒత్తిడి పెంచే కార్యక్రమాన్ని చేపట్టారు.