మన దేశంలో చట్టాలు, నిబంధనలు ప్రజలకేగాని ప్రజాప్రతినిధులైన ఎంపీలకు, ఎమ్మెల్యలకు వర్తించవు.వర్తించవంటే వారు పట్టించుకోరని అర్థం.
చట్టాలు, నిబంధనలు పాటించకపోతే ప్రజలను పాలకులు ఏదో ఒక రకంగా శిక్షిస్తారు.కాని పాలకులు వారు చేసిన చట్టాలను వారే పాటించకపోయినా ఎవ్వరూ ఏమీ అనరు.
ఇదేమిటని అడిగే దిక్కు ఉండదు.అందుకే మన పాలకులు తాము చేసిన చట్టాలను తామే అతిక్రమిస్తుంటారు.
అసెంబ్లీ నిబంధనల ప్రకారం ప్రతి శాసనసభ్యుడు (ముఖ్యమంత్రి, మంత్రులు సహా) ప్రతి ఏడాది తమ ఆస్తుల, అప్పుల వివరాలు వెల్లడించాలి.వెల్లడించాలంటే ఇవేమీ పత్రికల్లో ప్రచురించరు.
టీవీల్లో ప్రసారం చేయరు.సీల్డు కవరులో స్పీకరుకు ఇస్తారు.అంతే….! ఆయన కూడా ఎవ్వరికీ చెప్పరు.
ఇది రహస్యమైన వ్యవహారమే.ఆస్తులు, అప్పుల వివరాలు ఇచ్చినందువల్ల ప్రజాప్రతినిధులకు వచ్చిన నష్టమేమీ లేదు.కాని వారు నిబంధన పాటించరు.అంతే….! తెలంగాణలో ఆ రాష్ర్ట ముఖ్యమంత్రి కేసీఆర్ సహా నూటేడు మంది తమ ఆస్తులు, అప్పుల వివరాలు వెల్లడించలేదు.కేవలం పన్నెండు మంది మాత్రమే తెలియచేశారు.మిగిలినవారు ఎందుకు ఇవ్వడంలేదంటే…ఎందుకో కారణం తెలియదు.వీరికి అసెంబ్లీ అధికారులు ప్రతి రెండు నెలలకు వ్యక్తిగతంగా ఉత్తరాలు రాస్తున్నారు.
రిమైండర్లు పంపుతున్నారు.అయినప్పటికీ పట్టించుకోవడంలేదు.
అసెంబ్లీ నిబంధనల ప్రకారం ప్రతి సభ్యుడు అసెంబ్లీకి ఎన్నికైన నెల రోజుల్లోగా ఆస్తులు, అప్పుల వివరాలు వెల్లడించాలి.కాని పదిహేను నెలలు గడిచిపోయినా ఎవ్వరూ పట్టించుకోవడవంలేదు.
ఇలా చేస్తే ఏమనా శిక్ష ఉందా? అంటే లేదు.సామాన్య ప్రజలు ఏదైనా ఒక దరఖాస్తు గడువు తరువాత ఇచ్చారనుకోండి…నిర్దాక్షిణ్యంగా అధికారులు తిరస్కరిస్తారు.
మన ప్రజాప్రతినిధులు పొద్దున లేచిన దగ్గర్నుంచి నీతులు మాట్లాడతారు.ప్రజలకు నైతిక విలువల గురించి గీతోపదేశం చేస్తారు.
అవినీతిని సహంచబోమని డంబాలు పలుకుతారు.కాని వారు మాత్రం వీటికి అతీతంగా ఉంటారు.
పైకి నీతులు చెబుతూ లోపల అక్రమంగా సంపాదించకుంటారు.ఈ దేశాన్ని ఎవ్వరైనా బాగుచేయగలరా?
.