ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నందు నాసా శాస్త్రజ్ఞులు లెట్టూస్ వంటి ఆకుకూరలను పండిస్తున్నారు.దీని వలన వ్యోమగాములు తాజాగా తమ ఆహారాన్ని తయారుచేసుకోగలుగుతారు.
భూమిపై రైతులు ఎలా ఆకుకూరలను పండిస్తారో, అదే విధంగా ఐఎస్ఎస్ లోని వ్యోమగాములు ఎరుపు రంగులోని లెట్టూస్ ని పండిస్తున్నట్లు తెలిపారు.షేన్ కింబ్రో తన వెజ్- 03 ప్రయోగంలో భాగంగా రకరకాలుగా పరీక్షలు నిర్వహిస్తున్నారు.
ఈ ప్రయోగాలను మిగిలిన వ్యోమగాములు తమ స్థావరాలలో నుంచి వీక్షిస్తున్నారు.నికోల్ డ్యుఫోర్, నాసా వెజ్జీ ప్రాజెక్టు మేనేజర్ ఈ ప్రయోగాలు బ్రహ్మాండమైన ఫలితాలను ఇచ్చాయని తెలిపారు.
మొక్కల కుండీలలో ముందుగానే ఎరువులు, ఇతర అవసరాలను కలిపి ఉంచినట్లు, వ్యోమగాములు కేవలం కొద్ది మోతాదులో నీటిని చిలకరిస్తే సరిపోతుందని వారు తెలిపారు.మొక్కలను నాలుగు వారాల తర్వాత మిగతా ప్రయోగాలకు పంపుతున్నట్లు పేర్కొన్నారు.
ఈ ప్రయోగం అంగారక గ్రహానికి ప్రయాణించే వ్యోమగాముల ఆహారపు అవసరాలను తీరుస్తుందనే ధీమాను శాస్త్రజ్ఞులు వ్యక్తం చేస్తున్నారు.ఇదిలా ఉంటే మరో వైపు అమెరికా రోదసి సంస్థ నాసా వ్యోమగామి మైఖేల్ హాప్ కిన్స్ వీటిని సాగు చేశారు.పాక్ చోయి, అమారా ఆవాల మొక్కలను ఆయన పండించారు.64 రోజుల పాటు ఇవి పెరిగాయని నాసా తెలిపింది.ఐఎస్ఎస్లో అత్యంత ఎక్కువ కాలం పెరిగిన ఆకు కూరల పంట ఇదేనని పేర్కొంది.వీటిని అక్కడి వ్యోమగాములు ఇష్టంగా తిన్నారని హాప్కిన్స్ తెలిపారు.పాక్ చోయి అనే మొక్కలు పూలు పూసేంత పెద్దగా ఎదిగాయని నాసా తెలిపింది.
ఈ పూలల్లో పరాగ సంపర్కం కోసం హాప్కిన్స్ ఒక చిన్నపాటి పెయింట్ బ్రష్ను వినియోగించినట్లు వెల్లడించింది.దీనివల్ల విత్తన ఉత్పత్తి రేటు పెరిగిందని వివరించింది.ఈఏడాది చివర్లో పండ్ల సాగు కూడా జరగనుంది.
మిరియాల విత్తనాలను అంతరిక్షానికి పంపించనున్నట్లు నాసా వెల్లడించింది.