తెలంగాణ అధికార పార్టీ టిఆర్ఎస్ లో ఇప్పుడు సరికొత్త పరిణామాలు చోటు చేసుకునే విధంగా కనిపిస్తున్నాయి.ఇప్పటికే ఎమ్మెల్యేలు, పార్టీ నాయకుల పనితీరుపై సర్వేలు నిర్వహించి రిపోర్టులు తెప్పించుకుంటున్నారు అధినేత కేసీఆర్.
రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు గుర్రాల కే టికెట్లు ఇవ్వాలని కెసిఆర్ ప్రాథమికంగా డిసైడ్ అయిపోయారు.క్షేత్ర స్థాయిలో ప్రజా బలం లేని నాయకులను, ఎన్నికల్లో గెలిచే అవకాశం లేదు అనుకునే వారిని పూర్తిగా పక్కన పెట్టాలని డిసైడ్ అయ్యారు.
వాస్తవంగా చూసుకుంటే టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు చాలామంది తీవ్ర ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొన్నారు.అలాగే టిఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపైనా తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. దీంతో ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్ లో చేరిన నాయకుల్లో ఇప్పుడు ఆందోళన మొదలైంది.ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యేలు సైతం ఆందోళనలోనే ఉన్నారు.ఇప్పటికే రెండుసార్లు తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. గెలిచేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
కానీ ఇటీవల వరుసగా టిఆర్ఎస్ కు ఎదురవుతున్న వరుస ఓటములు టిఆర్ఎస్ నేతల్లో ఆందోళన పెంచుతున్నాయి. ముఖ్యంగా ఇతర పార్టీల నుంచి టిఆర్ఎస్ లో చేరిన నాయకులలో ఈ పరిణామాలు కలవరం పుట్టిస్తున్నాయి.
ఇప్పటికే ముందు నుంచి పార్టీలో ఉన్న నాయకులకు తమకు మధ్య సయోధ్య లేదని, దీనికితోడు ప్రజావ్యతిరేకత పార్టీపై తీవ్రమైతే తమ పరిస్థితి దారుణం గా మారుతుందనే ఆందోళన వలస నేతల్లో ఎక్కువగా కనిపిస్తోంది.దీంతో ఎన్నికలకు ముందుగానే మరో బలమైన పార్టీలో చేరి టికెట్ కన్ఫామ్ చేయించుకుంటే మంచిదనే అభిప్రాయం లో చాలామంది వలస నేతలతో పాటు, టీఆర్ఎస్ అసమ్మతి నేతలు ఉన్నారట.దీంతో ఈ పరిణామాలు ఎక్కడికి దారితీస్తాయి అనే ఆందోళన టీఆర్ఎస్ అగ్ర నాయకుల్లో పెరిగిపోతోంది.ఇప్పటికే తెలంగాణలో బీజేపీ బాగా బలపడటం తో టీఆర్ఎస్ నుంచి బీజేపీ లోకి మరిన్ని వలసలు చోటు చేసుకుంటే తమకు మరిన్ని ఇబ్బందులు వస్తాయనే ఆందోళన టీఆర్ఎస్ అగ్ర నాయకుల్లో ఎక్కువగా కనిపిస్తోంది.