సామాన్య మానవులైనా, రాజకీయ నాయకులైనా పరాజయ భారాన్ని భరించలేరు.పరాజయం పై విమర్శలను తట్టుకోలేరు.
మసిపూసి మారేడు కాయ చేసి కప్పి పుచ్చడానికి ప్రయత్నాలు చేస్తారు.ప్రస్తుతం బీజేపీ ఆ పనే చేస్తోంది.
బిహార్ పరాజయ భారం నుంచి తప్పించుకోవడానికి నానా పాట్లు పడుతోంది.విమర్శలు చేసిన సీనియర్ నాయకులపై చర్యలు తీసుకుంటే పార్టీ చీలిపోయే పరిస్థితి వస్తుంది.
సీనియర్ల మీద చర్యలు తీసుకోవాలన్న డిమాండును చాలా మంది నాయకులు వ్యతిరేకిస్తున్నారు.దీంతో మోడీ-అమిత్ షా ద్వయం వెనుకడుగు వేస్తోంది.
పార్టీ సీనియర్ నాయకులు అద్వానీ, మురలోమనోహర్ జోషి, యశ్వంత్ సిన్హా మొదలైనవారు మోడీని విమర్శించలేదని, ఎన్నికల్లో పార్టీ అనుసరించిన వ్యూహాన్ని (స్ట్రాటజీ) విమర్శించారని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు.సమస్యలు తలెత్తినప్పుడు పార్టీ వేదికల మీదనే చర్చించాలని, పబ్లిక్ లో మాట్లాడకూడదని బీహార్లోని కొందరు నాయకులను ఉద్దేశించి అన్నారు.
మరో మంత్రి నితిన్ గడ్కారి మాట మార్చారు.సీనియర్ల మీద చర్యలు తీసుకోవాలని తాను పార్టీ అధ్యక్షుడు అమిత్ షాను కోరలేదన్నారు.
కానీ సీనియర్ల మీద చర్యలు తీసుకోవాలని ముందుగా డిమాండ్ చేసిన నాయకుడు గడ్కరియే.బీహార్ ఎన్నికల ప్రభావం మోడీ పాలన మీద ఉండదని వెంకయ్య నాయుడు చెప్పారు.
ఎన్నికల్లో గెలవడం, ఓడిపోవడం సహజమని అన్నారు.సీనియర్ల మీద చర్యలు తీసుకుంటే పార్టీలో తీవ్ర ప్రకంపనాలు వస్తాయి.
దీని ప్రభావం మోడీ మీద ఎక్కువ ఉంటుంది.వచ్చే ఎన్నికల్లో పార్టీకి బలమైన దెబ్బ తగులుతుంది.
అందుకే నాయకులు సర్ది చెప్పుకుంటున్నారు.