బహుశా అమెరికా చరిత్రలో డొనాల్డ్ ట్రంప్ సర్కార్ తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా దాఖలైనన్ని పిటిషన్లు మరే అధ్యక్షుడికి ఎదురుకాలేదనుకుంటా.అధ్యక్ష పగ్గాలు చేపట్టిన నాటి నుంచి నేటి వరకు కొన్ని వందల పిల్లు వేశారు ప్రజలు, ప్రజా సంఘాలు, ఇతర సంస్థలు.
వీటిలో ట్రంప్ నిర్ణయానికి వ్యతిరేకంగా తీర్పు వచ్చిన ఘటనలే ఎక్కువ.తాజాగా ఉపాధి ఆధారిత హెచ్ 1 బీ వీసాల జారీ కార్యక్రమాన్ని మరింత కఠినతరం చేసే విధంగా ట్రంప్ యంత్రాంగం కొత్త నిబంధనలు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.
ఈ నిర్ణయం విదేశీయుల పాలిట గొడ్డలి పెట్టు లాంటిది.ఇదే సమయంలో ఈ కొత్త విధానం అమెరికా ఆర్ధిక వ్యవస్థకి మేలు చేయకపోగా.
కీడు చేస్తుందని అక్కడి సంస్థలు అభిప్రాయపడుతున్నాయి.
కొత్త వీసా విధానాన్ని సవాల్ చేస్తూ అమెరికా చాంబర్స్ ఆఫ్ కామర్స్, నేషనల్ అసోసియేషన్ ఆఫ్ మాన్యుఫాక్చర్స్తో సహా 17 సంస్థలు ఉత్తర కొలంబియా కోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి.
ఈ విధానం వల్ల నైపుణ్యం కలిగిన వారు అమెరికాకు వచ్చే వీలుండదని, దేశ ఆర్ధిక వ్యవస్ధను గాడిలో పెట్టడానికి ఈ వీసా విధానం అవరోధంగా మారుతుందని వీరు పిల్లో పేర్కొన్నారు. అమెరికా ఫస్ట్ అన్న నినాదాన్ని ముందుకు తీసుకువెళుతున్న ట్రంప్ ఈ నెల మొదట్లో హెచ్ 1 బీ వీసా కార్యక్రమంలో నిబంధనల్ని మరింత కఠినతరం చేసిన విషయం తెలిసిందే.
దేశానికి చట్టబద్ధమైన వలసలను అరికట్టడం స్థానికీకరణ, అమెరికా ఉద్యోగులను రక్షణ తమ ధ్యేయమని ట్రంప్ తన మధ్యంతర ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
వీసాల రెన్యువల్తో పాటు కొత్త వీసాల దరఖాస్తుకు ప్రస్తుతమున్న నిబంధనలను కఠినతరం చేస్తూ విడుదల చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అమెరికాలో స్థిరపడిన, స్థిరపడాలని భావిస్తున్న లక్షలాది మంది భారతీయ ఐటీ నిపుణులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.ట్రంప్ పాలనా యంత్రాంగం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల అమెరికాలోని దాదాపు 2.8 లక్షల మంది భారతీయ ఐటీ నిపుణులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా తీవ్ర నష్టం వాటిల్లనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
కనీస వార్షిక వేతన పరిమితి ఏకంగా 45 శాతం పెంపుతో పాటు కంపెనీ ఉద్యోగులు, కన్సల్టెన్సీ ఉద్యోగుల వీసాల రెన్యువల్ కాలపరిమితిలో మార్పు, రెన్యూవల్ ఫీజు పెంపు, అమెరికాలో ఐటీ సంబంధిత అడ్వాన్స్డ్ డిగ్రీ పూర్తి చేసిన వారికే వీసాలివ్వాలనే నిబంధనలు ఉండటం భారతీయ ఐటీ నిపుణులు, ఉద్యోగుల భవితవ్యాన్ని ప్రశ్నార్థకం చేయనున్నాయి.ఇకపై హెచ్ 1 బీ వీసా దరఖాస్తుదారులు 1.10 లక్షల డాలర్ల కనిష్ట వార్షిక వేతనం ఉంటేనే వీసా పొందడానికి అర్హత పొందుతారు.ఇప్పటి వరకు ఉన్న నిబంధనల ప్రకారం 65 వేల డాలర్లుంటేనే వీసాకు దరఖాస్తు చేసుకొనే అవకాశముండేది.
ఈ నిబంధనల కారణంగా భారతీయ ఐటీ ఉద్యోగులకు గడ్డుకాలం ఎదురుకానుంది.