కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేసి మరణమృదంగం మోగిస్తోంది.ఇప్పటికే లక్షలాది సంఖ్యలో ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.
ఇక కరోనా నుండి ప్రజలను కాపాడేందుకు పలు దేశాల ప్రభుత్వాలు లాక్డౌన్ విధించాయి.అయితే ఈ లాక్డౌన్ కారణంగా కనివిని ఎరగని సంఘటనలు ఆవిష్కృతమవుతున్నాయి.
తమ ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకునే వేల సంఖ్యలో వలస జీవులు కాలినడకన తమ సొంత గూటికి చేరుకునే ప్రయత్నం చేస్తున్నారు.అటు కరోనా వైరస్ సోకిన వారిని పూర్తిగా క్వారంటైన్లో పెట్టి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
ఇక కరోనా సోకిన వారిని కొన్ని ప్రాంతాల్లో పూర్తిగా అంటరాని వారిలా చూస్తున్నారు ప్రజలు.ఇలాంటి ఘటనలు వెలుగులోకి రాకపోవడం గమనార్హం.అయితే కరోనా వల్ల మరణించిన వారికి అంత్యక్రియలు చేయాలంటే కూడా తమకెక్కడ ఈ వైరస్ సోకుతుందోనని జనం వణికిపోతున్నారు.తాజాగా ఇలాంటి ఘటన ఒడిషా రాష్రంలో చోటు చేసుకుంది.
ఇక్కడ మరో విడ్డూరం ఏమిటంటే శవం లేకుండానే అంత్యక్రియలు నిర్వహించారు సదరు మృతుడి కుటుంబీకులు.
గంజాం జిల్లా హరీపూర్ చందిన ఓ వ్యక్తి బతుకుతెరువు కోసం గుజరాత్కు వెళ్లాడు.
ఈ నెల 12న తిరిగి తన సొంతూరుకు చేరుకున్నాడు.అయితే అతడిని భంజానగర్లోని ఓ ఆసుపత్రికి తీసుకెళ్లగా, అతడు అనారోగ్యం కారణంగా మృతి చెందాడు.
అయితే అతడికి కరోనా పాజిటివ్ వచ్చిందని వైద్యులు పొరబడి ఆ సమాచారం కుటుంబ సభ్యులకు తెలిపారు.దీంతో అతడు కరోనాతోనే మరణించాడని వారు అనుకున్నారు.
కానీ మరణాంతరం మరోసారి పరీక్షలు చేయగా అతడికి కరోనా నెగెటివ్ వచ్చింది.ఇది వారి కుటుంబ సభ్యులకు తెలిపినా వారు మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు ధైర్యం చేయలేదు.
దీంతో అతడికి అక్కడే అంత్యక్రియలు జరిపారు.ఇక సొంతూరిలో అతడి మృతదేహం లేకపోవడంతో ఇసుక బస్తాలను శవంలా మార్చి అంత్యక్రియలు జరిపించారు.ఇది తెలుసుకున్న స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు.ఇలా కరోనా వైరస్ కారణంగా మనిషి చావును కూడా జరపడం లేదని పలువురు కామెంట్ చేస్తున్నారు.
ఏదేమైనా కరోనా వైరస్ కారణంగా మానవ సంబంధాలకు తూట్లు పడుతున్నాయని, ఈ పరిస్థితి ఎప్పుడు చక్కబడుతుందో అని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.