సర్వేల పేరుతో ఎప్పుడూ హడావుడి చేస్తూ… రాజకీయ పార్టీల జాతకాలు చెప్పే ఆంధ్రా ఆక్టోపస్ అనే పేరు పొందిన విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కొద్ది రోజులుగా వార్తల్లో వ్యక్తిగా మారారు.సరిగ్గా తెలంగాణ లో పోలింగ్ తేదీ కి పట్టుమని పది రోజులు లేని సమయంలో లగపాటి తన సర్వే ఫలితాలను స్వల్పంగా బయటకి వదులుతూ… కాకరేపుతున్నాడు.
అంతేనా అంటే తెలంగాణ ఎన్నికల్లో స్వతంత్రుల హవా ఉండబోతోంది అంటూ చెప్పడమే కాకుండా రెండు మూడు పేర్లను బయటకి వదిలాడు.స్వతంత్రులు పోటీ చేస్తున్న పది నియోజకవర్గాల్లో దాదాపు ఎనిమిది గెలుచుకోబోతున్నారు అంటూ… ప్రకటించేశాడు.
ఇంకేముందు ఈ పరిణామాలు టీఆర్ఎస్ పార్టీకి ఆగ్రహం తెప్పించాయి.అంతే కాదు ఏకంగా ఆయన మీద తెలంగాణ ఎన్నికల అధికారి రజత్ కుమార్ కి ఫిర్యాదు కూడా చేసేసారు.
లగడపాటి సర్వే ప్రకారం టీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారం చేజిక్కించుకోవడానికి అవసరం అయిన మ్యాజిక్ ఫిగర్ కి కేవలం మూడు సీట్లు మాత్రమే ఎక్కువ వచ్చాయి.ఇక ఈ ఎన్నికల్లో హంగ్ వచ్చే అవకాశం కూడా లేకపోలేదని కొంతమంది రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.ఇక ఎంఐఎం నేత అక్బరుద్దిన్ కూడా ఇంచుమించు ఇటువంటి వ్యాఖ్యలే చేశారు.తమ సహాయ సహకారాలు లేకుండా ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు అంటూ సవాల్ విసిరారు.
అంతే కాదు కర్ణాటకలో కుమారస్వామి లా తామెందుకు కాదన్నట్లుగా ఆయన మాట్లాడారు.ఒకవేళ అదే నిజమై ఏ పార్టీ కూడా మ్యాజిక్ ఫిగర్ ని చేరుకోకపోతే ఎవరు ఎవరికి మద్దతు ఇస్తారు అనేది క్లారిటీ కనిపించడంలేదు.
ఇక కాంగ్రెస్ కు మాత్రం లగడపాటి సర్వే ఫలితాలు బూస్ట్ ఇచ్చినట్టుగా కనిపిస్తున్నాయి.ఎందుకంటే… లగడపాటి చెబుతున్న లెక్కల ప్రకారం గెలిచే అవకాశం ఉన్న స్వతంత్ర అభ్యర్థులంతా కాంగ్రెస్ రెబెల్ అభ్యర్థులే.లగడపాటి చెప్పిన గెలిచే అభ్యర్థి శివకుమార్ రెడ్డి గత ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసినా టీఆర్ఎస్ ను తీవ్రంగా వ్యతరేకించి కాంగ్రెస్ లో చేరారు.కాంగ్రెస్ లోనూ టిక్కెట్ దక్కకపోవడంతో కాంగ్రెస్ రెబల్ గానే బరిలో ఉన్నారు.
అనీల్ కుమార్ జాదవ్ కూడా కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి.రాష్ట్రవ్యాప్తంగా బరిలో ఉన్న స్వతంత్రులు కూడా ఎక్కువగా కాంగ్రెస్ రెబెల్సే.
పొత్తుల్లో భాగంగా టిక్కెట్లు దొరకకపోవడంతో వారు స్వతంత్రంగా బరిలో దిగారు.వీరు ఒకవేళ గెలిస్తే కాంగ్రెస్ కే మద్దతు ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.
ఒకవేళ కాంగ్రెస్ కు మ్యాజిక్ ఫిగర్ రాకపోతే… కూటమిలోని పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా తమకు మద్దతు ప్రకటించే అవకాశం ఉన్నందున ఖచ్చితంగా తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేస్తోంది.