ఆంధ్ర ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్ సర్వేలకు ఉన్న విశ్వసనీయత అంతా ఇంతా కాదు.లగడపాటి ఒక సర్వే విడుదల చేశాడంటే ఖచ్చితంగా అలా జరిగితీరాల్సిందే.
అవును లగడపాటి సర్వేలు అలా ఉంటాయి మరి.కేవలం లగడపాటి సర్వేలను నమ్ముకునే అనేక మంది పందేలకు దిగుతుంటారు.అయితే ఇప్పుడు లగడపాటి సర్వే తారుమారయ్యింది.ఇప్పుడే కాదు మొన్నా మధ్య తెలంగాణాలోనూ లగడపాటి జోస్యం ఫలించలేదు.ఆయన సర్వేలను నమ్ముకుని అనేకమంది టీడీపీ గెలుస్తుందని పందేలు కాశారు.తీరా చూస్తే టీడీపీ ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది.
దీంతో ఆ పార్టీ గెలుస్తుందని పందేలు కాసిన వారంతా గగ్గోలుపెడుతున్నారు.
టీడీపీ సొంతంగా అధికారంలోకి వస్తుంది, మహిళల ఓట్లు టీడీపీకే ఎక్కువ శాతం పడ్డాయనీ చెప్పారు.
అంతే కాదు సుమారు 90 నుంచీ 110 స్థానాల్లో టీడీపీ గెలవడం పక్కా అంటూ గొప్పలు చెప్పారు.అలాగే తన సర్వేను నమ్మాల్సిన పనిలేదంటూనే అత్యంత లోతుగా తాను సర్వే చేయించానని ఇది ఇది తనకు జీవన్మరణ పోరాటం అనీ, ఖచ్చితంగా సరైన ఫలితాలు ఇవ్వాల్సిన బాధ్యత, భారం తనపై ఉందంటూ గట్టిగా చెప్పారు.
అయితే ఇప్పుడు వస్తున్న ఫలితాలు చూస్తే మాత్రం రివర్స్ అయ్యాయి.లగడపాటి చెప్పిన సంఖ్యకు కనీసం దరిదాపుల్లో టీడీపీ కనిపించడంలేదు.దీంతో ఆయన సర్వేలన్నీ బోగస్ అంటూ అంతా సర్టిఫికెట్ ఇచ్చేస్తున్నారు.
లగడపాటి సంస్థ అయిన RG ఫ్లాష్ టీం సర్వే అంచనాలు అట్టర్ ఫ్లాప్ అవ్వడానికి చాలా కారణాలే కనిపిస్తున్నాయి.లగడపాటికి టీడీపీతో సత్సంబంధాలు ఉండడంతో కావాలనే ఆయన టీడీపీకి అనుకూలంగా సర్వేలు ఇస్తున్నట్టు కనిపిస్తోంది.అదీ కాకుండా చంద్రగిరిలో టీడీపీని గెలిపించే ఎత్తుగడలో భాగంగా ఎగ్జిట్ పోల్స్ కి ఒకరోజు ముందు ప్రెస్ మీట్ పెట్టి ఏపీ ప్రజలు టీడీపీకి బ్రమ్మరథం పెట్టారంటూ లగడపాటి చెప్పారన్న కోణం కూడా కనిపిస్తోంది.
తాను ఐదేళ్లుగా టీవీయే చూడలేదని లగడపాటి చెప్పారు.అంటే అసలు రాజకీయాలపై, అలాంటి అంశాలపై లగడపాటికి ఎలాంటి ఆసక్తి కనబరచలేదని అర్ధం అవుతోంది.ఈ దశలో లగడపాటి సర్వేలు ఎలా చేయించాడో ఎవరికీ అర్ధం కావడంలేదు.
తన సర్వే రెండుసార్లు తప్పుగా వస్తే తన సర్వేల ఫలితాలు తెలుసుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉండరనీ, అందువల్ల ఇకపై తాను గోడలకే సర్వేల ఫలితాలు చెప్పుకోవాల్సి వస్తుందని లగడపాటి స్వయంగా అన్నారు.
ఇప్పుడు రెండుసార్లు ఫలితాలు తేడా కొట్టడంతో లగడపాటి సర్వేలకు స్వస్తి చెబుతారా అనేది తెలియాల్సి ఉంది.