ఆర్టికల్ 370 రద్దు పై కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో మండిపడుతున్న సంగతి తెలిసిందే.అయితే వారికి ఝలక్ ఇస్తూ బీజేపీ లడక్ ఎంపీ జాంయాంగ్ పార్లమెంట్ లో స్పెషల్ స్పీచ్ ఇచ్చారు.
కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాన్ని లడక్ ప్రజలు ఎంతో ఆనందంగా స్వాగతిస్తున్నారు అని, గత 72 సంవత్సరాలుగా అసలు లడక్ లో ఏమి జరుగుతుంది అన్న విషయం మీకు తెలుస్తుందా అని ప్రశ్నించారు.గత ఇన్ని సంవత్సరాలుగా లడఖ్ ఏమాత్రం అభివృద్ధికి నోచుకోలేదని,దీనికి ప్రధాన కారణం ఈ ఆర్టికల్ 370 మరియు కాంగ్రెస్ పార్టీ నే అంటూ ఆయన ఆరోపించారు.
లడక్ కోసం ఏఒక్కరూ కూడా పట్టించుకోలేదని, కేవలం ఈ ఆర్టికల్ 370 ని అడ్డం పెట్టుకొని వాళ్ళను వాళ్ళు మాత్రమే అభివృద్ధి చేసుకున్నారు తప్ప పక్కవారికి ఎలాంటి ప్రయోజనం కలగలేదంటూ ఆయన వాపోయారు.ఇప్పటికి కూడా కాంగ్రెస్ కేవలం పుస్తకాలు తిరగేసి మాట్లాడుతుంది తప్ప అక్కడి వాస్తవాల గురించి ఏమి తెలియదని, నేను మాత్రం అక్కడి వాస్తవాలను చూసి ఇలా సభలో మాట్లాడుతున్నాను అని తెలిపారు.ఈ క్రమంలో ఆయన కాంగ్రెస్ పార్టీ పై కొన్ని సెటైర్లు వేయడం తో పార్లమెంట్ మొత్తం కూడా నవ్వులు పూశాయి.అంతేకాకుండా లడక్ లో అసలు కాశ్మీర్ జెండా ను ఎగురవేయడం ఎప్పుడో నిలిపేశామని, 2011 నుంచి జాతీయ పతాకమే అక్కడ రెపరెపలాడుతోంది అని ఆయన స్ఫష్టం చేశారు.
మరోపక్క జాంయాంగ్ స్పీచ్ కు సభలో ఉన్న బీజేపీ నేతలే కాకుండా ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఫిదా అయిపోయారు.ఆయన స్పీచ్ ఇచ్చిన అనంతరం ట్విట్టర్ ద్వారా మోడీ ఆయన ప్రసంగాన్ని ప్రశంసించారు.
లడఖ్లోని మన సోదరీసోదరమణుల ఆకాంక్షలను ప్రతిఫలించేలా ఆయన ప్రసంగించారు.ఇది తప్పకుండా వినాల్సిన స్పీచ్ అని అంటూ మోదీ ట్వీట్ చేశారు.