ఉమ్మడి రాష్ట్రంలో ఏపీ ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఆయన ప్రాణ స్నేహితుడు కేవీపీ రామచంద్రరావు ప్రభుత్వంలో చక్రం తిప్పేవారు.రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు హోదాలో షాడో సీఎం గా కేవీపీ పెత్తనం చేస్తుండేవారు.
రాజశేఖర రెడ్డి కూడా అదే స్థాయిలో కేవీపీకి ప్రాధాన్యం ఇస్తూ తన ఆత్మ కేవీపీ అంటూ చెబుతుండేవారు.అయితే రాజశేఖర రెడ్డి మరణం అనంతరం కేవీపీ హవా మొత్తం తగ్గిపోయింది.
వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు జగన్ వైసీపీని స్థాపించినప్పుడు కేవీపీ చేరుతారని, జగన్ కు అండగా ఉంటారని అంతా భావించారు.అయితే ఆయన మాత్రం కాంగ్రెస్ ను విడిచిపెట్టలేదు.2019 ఎన్నికలకు ముందు వరకు కేవీపీ రామచంద్రరావు యాక్టివ్ గా ఉండేవారు.కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడిగా ఆయన ఏపీ రాజకీయాలపైనే ఎక్కువగా దృష్టి పెట్టేవారు.
అప్పటి చంద్రబాబు ప్రభుత్వం పై ఆయన నిప్పులు చెరిగేవారు.తరచు లేఖలను విడుదల చేస్తూ టీడీపీ ప్రభుత్వం పై హీటు పెంచేవారు.
ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు విషయంలో చంద్రబాబునాయుడును ముప్పుతిప్పలు పెట్టేవారు.
తెలంగాణాలో మహాకూటమి పేరుతో తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ తో పొత్తుపెట్టుకున్నా, పార్టీ అధినేత రాహుల్ గాంధీతో సమావేశాలు అవుతున్నా కేవీపీ మాత్రం చంద్రబాబుపై తనకు ఉన్న రాజకీయ వైరాన్ని మర్చిపోలేదు.వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రారంభించిన పోలవరం ప్రాజెక్టు ను చంద్రబాబు తన కలల ప్రాజెక్టుగా చెప్పుకోవడంపై నిత్యం విమర్శలు చేస్తూ వార్తల్లో నిలిచేవారు.ఇక ఆ తరువాత తరువాత కేవీపీ సైలెంట్ అయిపోయారు.
కానీ ఇప్పుడు ఏపీ లో జగన్ ప్రభుత్వం కొలువుతీరడంతో కేవీపీ పొలిటికల్ గా యాక్టివ్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోంది.ప్రస్తుతం ఏపీలో పోలవరం ప్రాజెక్టు విషయంలో గందరగోళం చోటు చేసుకుంటుంటోంది.
పోలవరం పనులు నిలిచిపోయాయ.రివర్స్ టెండరింగ్ కు జగన్ ప్రభుత్వం వెళ్లింది.
ప్రభుత్వానికి ప్రజాధనం ఆదా చేయడం కోసమే తాము రివర్స్ టెండరింగ్ వెళ్లామని వైసీపీ చెబుతోంది.అయితే ఇంత జరుగుతున్నా కేవీపీ రామచంద్రరావు మాత్రం సైలెంట్ గానే ఉండిపోయారు.
కానీ తెర వెనుక మాత్రం జగన్ ప్రభుత్వానికి అనుకూలంగా ఆయన చక్రం తిప్పుతున్నట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం కేవీపీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నా లేనట్టుగానే వ్యవహరిస్తున్నారు.కాంగ్రెస్ సభలు, సమావేశాలకు పెద్దగా హాజరుకావడంలేదు.అయితే కేవీపీ వ్యూహాత్మకంగానే రాజకీయ మౌనం పాటిస్తున్నారని, ఆయన వైసీపీ లో చేరేందుకు పావులు కదుపుతున్నారని ప్రచారం హాట్ టాపిక్ గా మారింది.
వైఎస్ హయాంలో చక్రం తిప్పిన కేవీపీ ఇప్పుడు జగన్ కు కూడా అదే స్థాయిలో సలహాలు, సూచనలు ఇచ్చేందుకు సిద్ధం అయినట్టు తెలుస్తోంది.వైసీపీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కేవీపీ చేరితే మంచే జరుగుతుందన్న ఆలోచనలో జగన్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది.
ఇక తెలంగాణ సీఎం కేసీఆర్ తోనూ సన్నిహితంగా ఉండే కేవీపీ, జగన్, కేసీఆర్ మధ్య స్నేహం కుదిరేలా తెర వెనుక వ్యూహాలు చేసినట్టు కూడా వార్తలు వచ్చాయి.ఏదైతేనేమి పరోక్షంగా వైసీపీకి మద్దతుగా నిలుస్తున్న కేవీపీ తొందర్లోనే వైసీపీ జెండా కప్పుకునేందుకు ఆరాటపడుతున్నట్టు తెలుస్తోంది.