హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా టిఆర్ఎస్ గెలుస్తుంది అని అంతా అంచనా వేశారు.దీనికి తగ్గట్లుగానే కేసీఆర్ దళిత బంధు వంటి భారీ బడ్జెట్ పథకాన్ని అమలు చేయడం, ఈటెల రాజేందర్ ప్రధాన అనుచరులు అందర్నీ టిఆర్ఎస్ లో చేర్చుకోవడం, టిఆర్ఎస్ ట్రబుల్ షూటర్ గా పేరున్న మంత్రి హరీష్ రావుకు ఈ నియోజకవర్గం బాధ్యతలు అప్పగించడం, మంత్రులు ఎమ్మెల్యేలను హుజూరాబాద్ నియోజకవర్గం లోని గ్రామాలు ,మండలాల వారీగా నియమించడం ఇలా ఎంతగానో ఈ నియోజకవర్గంలో టిఆర్ఎస్ గెలిచేందుకు వ్యూహాలను అమలు చేశారు .
కానీ చివరకు ఎన్నికల ఫలితం నిరాశ కలిగించింది.బీజేపీ నుంచి పోటీ చేసిన ఈటెల రాజేందర్ 24,000 మెజారిటీతో విజయాన్ని దక్కించుకున్నారు.
దీంతో టీఆర్ఎస్ లో టెన్షన్ మొదలవడం తో పాటు, క్షేత్రస్థాయి కార్యకర్తల్లో ఆందోళన నెలకొంది.టిఆర్ఎస్ 2023 ఎన్నికలు ఫలితాలపై కూడా హుజురాబాద్ ఫలితం ప్రభావం చూపే అవకాశం ఉండడంతో, అప్పుడు ఫలితం ఎలా ఉంటుందో అనే టెన్షన్ ఇప్పటి నుంచే పార్టీ నాయకుల్లో మొదలైంది.
ఈ విషయాన్ని టిఆర్ఎస్ అధిష్టానం గుర్తించింది.ఏదో ఒకటి చేసి కార్యకర్తల్లో ఉత్సాహం నింపి మళ్లీ వారందరినీ యాక్టివ్ చేయాలనే విషయంపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దృష్టిపెట్టారు.
దీనిలో భాగంగానే వరంగల్ లో నిర్వహించాలనుకున్న విజయ గర్జన సభకు ఉపయోగించుకునేందుకు సిద్ధమయ్యారు.
ఈ సభను సక్సెస్ చేయడం ద్వారా పార్టీ నాయకుల్లో మరింత ఉత్సాహం పెరుగుతుందని, హుజురాబాద్ ఫలితాన్ని పక్కన పెట్టి మళ్ళీ అంతా యాక్టివ్ అవుతారని కెసిఆర్ నమ్ముతున్నారు.అందుకే ఈ విజయ గర్జన బాధ్యతలు మంత్రి కేటీఆర్ పై పెట్టారు.ప్రస్తుత పరిస్థితుల్లో భారీ ఎత్తున జన సమీకరణ చేయడం సాధ్యం అవుతుందా లేదా అనేది కూడా కాస్త ఆందోళన కలిగిస్తోంది.
ఏదో రకంగా భారీ జన సమీకరణ మధ్య విజయ గర్జనను విజయవంతం చేయడం ద్వారానే , మళ్లీ టిఆర్ఎస్ ప్రభావం కనిపించేలా చేయవచ్చు అనేది కేటీఆర్ అభిప్రాయంగా తెలుస్తోంది.
ఇక హుజురాబాద్ ఎన్నికల ఫలితం సంగతి పక్కనబెట్టి, రాష్ట్రవ్యాప్తంగా పార్టీ కేడర్ లో ఉత్సాహం నింపడమే ధ్యేయంగా కేటీఆర్ రంగంలోకి దిగబోతున్నారట.ఇక వరుసగా నియోజకవర్గాల వారీగా పర్యటనలు చేపట్టి 2023 ఎన్నికల నాటికి టిఆర్ఎస్ పార్టీ నాయకుల్లో నమ్మకం ఏర్పరుచుకోవడం తో పాటు, ప్రజలలోను మరింత ఆదరణ పెరిగేలా చేసుకునే వ్యూహంతో కేటీఆర్ సిద్ధమవుతున్నారట.2023 ఎన్నికల్లో టిఆర్ఎస్ విజయకేతనం ఎగరవేసేలా చేయాల్సిన బరువు బాధ్యతలు కేటీఆర్ పైనే ఉన్నాయి.