తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల రీత్యా కేసీఆర్ తనయుడు కేటీఆర్ కి ముఖ్యమంత్రి పదవి అప్పజెప్పి సీఎం కేసీఆర్ ఫాంహౌస్కే పరిమితమయ్యి రెస్ట్ తీసుకోవడం మంచిదని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అభిప్రాయపడ్డారు.ప్రస్తుతం రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల కారణంగా చాలా లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయి వాటిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైతే ఆ ప్రాంతాలను సందర్శించడానికి యువకుడైన కేటీఆర్ కు సౌలభ్యంగా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు
ప్రస్తుతం తెలంగాణ లో కేటీఆర్ ని త్వరలో సీఎం చేసే ఆలోచనలో కేసిఆర్ ఉన్నాడని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో కేటీఆర్ ను ముఖ్యమంత్రి చేయడమే మంచిదని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ కూడా అభిప్రాయపడడం తో ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇక భారీ వర్షాల కారణంగా హనుమకొండ,వరంగల్ జిల్లాలలో కొట్టుకుపోయిన రోడ్లను,లోతట్టు ప్రాంతాలను గురువారం సీపీఐ నాయకులు సందర్శించారు.
తాను చేసిన సూచనలను ప్రభుత్వం పక్కన పెడుతుందని ఆవేదన వ్యక్తం చేసిన తెలంగాణ గవర్నర్ వ్యాఖ్యలను గుర్తు చేసిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖల్లో నిజాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు.