తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా, ఎంతోమంది ప్రాణాలు కోల్పోవడం, ఈ వరదల ప్రభావం మరీ ఎక్కువగా కనిపిస్తోంది.ప్రధాన వీధులన్నీ పూర్తిగా జలమయం అవ్వడం, ఎన్నో వేల ఇళ్లు ముంపునకు గురి అవ్వడం, ఎంతోమంది నిరాశ్రయులు అవడం, మారెంతోమంది ప్రాణాలు కోల్పోవడం వంటి సంఘటనలతో అధికార పార్టీ టిఆర్ఎస్ పై ప్రజల్లో ఆగ్రహం పెరిగిపోతోంది.
ఒకపక్క గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఉండడంతో, టిఆర్ఎస్ పార్టీలో ఆందోళన మొదలైంది.ఇదిలా ఉంటే ప్రజలను పరామర్శించేందుకు వెళ్తున్న అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులపై ప్రజలు తమ ఆగ్రహాన్ని చూపిస్తుండడం, స్వయంగా కేటీఆర్ క్షేత్ర స్థాయిలో పర్యటించిన సందర్భంగా ఆయనకు ప్రజల నుంచి నిరసనలు పెద్ద ఎత్తున రావడం, వంటి సంఘటనలను టిఆర్ఎస్ ప్రభుత్వం సీరియస్ గానే తీసుకుంది.
రానున్న రోజుల్లో ఇది మరింత ఇబ్బందికర పరిణామాలను తీసుకువచ్చే అవకాశం ఉండడంతో రంగంలోకి దిగిన కేటీఆర్, అసలు వరద ప్రభావం హైదరాబాదు ను ముంచెత్తడానికి గల కారణాలేంటి అనే విషయం పైన పూర్తిగా దృష్టి పెట్టారు.అక్రమ కట్టడాలు కారణంగానూ, డ్రైనేజీ నిర్మాణంలో లోపాల కారణంగా ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చిందని, ఒక అంచనాకు వచ్చిన కేటీఆర్ దీని నిమిత్తం ప్రత్యేకంగా ఒక సమావేశం నిర్వహించే ఆలోచనలో ఉన్నారట.
గతంలో హైదరాబాదు లో ఎక్కడెక్కడ ఎన్ని ఎన్ని చెరువులు ఉన్నాయి అనే విషయాలను తెలుసుకుంటూ, వాటి వివరాలను అందించాల్సిందిగా అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఈ మేరకు దీనిపై ఒక జాబితాను కూడా సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఎక్కడెక్కడ చెరువులు ఆక్రమణలకు గురయ్యాయి అనే విషయంపై పూర్తిగా జాబితాను సిద్ధం చేసుకుని, అక్రమ కట్టడాలను కూల్చివేసి, మళ్లీ యధాతధంగా అక్కడ చెరువులను తవ్వించాలనే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.ఈ అక్రమ కట్టడాల కూల్చివేత విషయంలో ఏ పార్టీ వారైనా వదిలిపెట్టకూడదు అని, ఎంత పెద్ద వ్యక్తులు ఉన్నా సరే నిబంధన ప్రకారం ఆక్రమణలు తొలగించాలని కేటీఆర్ డిసైడ్ అయ్యారట.
మరికొద్ది రోజుల్లోనే ఈ తంతు మొదలయ్యే అవకాశం కనిపిస్తోంది.ఈ రకంగా అయినా తమ పార్టీపై వచ్చిన వ్యతిరేకతను తగ్గించుకోవాలని దిశగా కేసీఆర్ అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తోంది.