దుబ్బాక లో దెబ్బతిన్న టిఆర్ఎస్ పార్టీ ఇప్పుడు గ్రేటర్ లో టిఆర్ఎస్ జెండా పాతి, తిరిగి పోయిన పరువుని దక్కించుకోవాలనే ఆలోచనతో ఉంది.మొన్నటి వరకు గెలుపుపై ధీమా గా ఉంటూ వచ్చిన ఆ పార్టీకి ఊహించని విధంగా దుబ్బాకలో ఓటమి ఎదురయింది.
ఆ ప్రభావం ఇప్పుడు గ్రేటర్ ఎన్నికలపై పడకుండా, అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటోంది.దీనికితోడు ఇటీవల గ్రేటర్ లో సంభవించిన వరదల కారణంగా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవ్వడం, అలాగే వరద సహాయం పంపిణీ విషయంలో అనేక అవకతవకలు చోటు చేసుకోవడం, వంటి ఎన్నో పరిణామాలను టిఆర్ఎస్ చాలా సీరియస్ గానే తీసుకుంటోంది.
అందుకే ఇక్కడ పూర్తి స్థాయిలో దృష్టి పెట్టినట్టు కనిపిస్తోంది.
ఈ మేరకు గ్రేటర్ ప్రచారానికి అవసరమైతే సినీ ప్రముఖులను రంగంలోకి దించి, ప్రచారం చేయించాలనే ఆలోచనలను కేటీఆర్ ఉన్నట్టుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.
మొదటి నుంచి సినీ ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పాటు చేసుకుని, వారికి సంబంధించిన అన్ని విషయాల్లోనూ అనుకూలంగా వ్యవహరిస్తూ కేటీఆర్ వస్తున్నాడు.అలాగే సామాజిక మాధ్యమాల్లో ఆయన యాక్టివ్ గా ఉంటూ రావడం, ఆ పరిచయాలతోనే ఇప్పుడు గ్రేటర్ లో గట్టెక్కేందుకు వారి సహాయం తీసుకునేందుకు కేటీఆర్ సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది.
ఇప్పటికే రాష్ట్ర సమాచార శాఖ కొంతమంది సినీ ప్రముఖులు, హీరోలతోనూ సమావేశం అయినట్లుగానూ , వారితో వివిధ ప్రభుత్వ ప్రకటనలను వారితో చేయించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
అలాగే మంత్రి కేటీఆర్ సైతం సినీ హీరోలు కొంతమందిని ప్రత్యేకంగా పిలిచి, వారితో భేటీ అయ్యి, గ్రేటర్ ఎన్నికల అంశంపై చర్చించినట్లు తెలుస్తోంది.అయితే వారిలో కొంతమంది కాస్త మొహమాటం వ్యక్తం చేసినా, మరికొంతమంది మాత్రం ప్రచారానికి వచ్చేందుకు సిద్ధం అన్నట్లుగా చెప్పినట్లు ఇప్పుడు అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.అలాగే గ్రేటర్ పరిధిలో ఎక్కువగా ఉన్న సెటిలర్ల ఓట్లను టీఆర్ఎస్ ఖాతాలో పడే విధంగా కేటీఆర్ వ్యూహాలు రచించే పనిలో ఉన్నారని, వారి ప్రభావం ఈ ఎన్నికల్లో ఎక్కువగా ఉండడంతో, ప్రభుత్వ పరంగా అనేక హామీలు ఇస్తూ, ఈ ఎన్నికల్లో గట్టెక్కాలనే ఆలోచనలో ఉన్నారట.
ప్రస్తుతం గ్రేటర్ బాధ్యతలు మొత్తం ఆయనే తీసుకోవడంతో పాటు, ఈ ఎన్నికలు ముగిసిన అనంతరం తెలంగాణ సీఎంగా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉండడంతో, ఈ ఎన్నికలపై పూర్తిగా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.