ఉన్నత చదువుల కోసం కెనడా వెళ్లిన ఓ తెలుగు విద్యార్ధి పరాయి దేశంలో ప్రమాదవశాత్తూ మరణించాడు.వివరాల్లోకి వెళితే.
హైదరాబాద్ వనస్థలిపురం ఫేజ్-4లో ఉంటున్న శ్రీకాంత్, హరిప్రియ దంపతుల రెండో కుమారుడు పాణ్యం అఖిల్ (19) కెనడాలోని టొరంటోలో హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చేస్తున్నాడు.మొదటి సెమిస్టర్ పూర్తి చేసుకుని గత మార్చి 20న నగరానికి వచ్చిన అఖిల్.
తిరిగి గత నెల 5న కెనడాకు వెళ్లాడు.ఈ క్రమంలో ఈ నెల 8న తెల్లవారుజామున తను నివసిస్తున్న అపార్ట్మెంట్ 27వ అంతస్తు బాల్కనీలో ఫోన్లో మాట్లాడుతుండగా ప్రమాదవశాత్తు కిందపడ్డాడు.
ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన అఖిల్ అక్కడికక్కడే మరణించాడు.ఈ విషయాన్ని అతని స్నేహితులు అఖిల్ తల్లిదండ్రులకు తెలియజేశారు.
కుమారుడి మరణవార్త తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.అఖిల్ మృతదేహాన్ని హైదరాబాద్కు తీసుకొచ్చేందుకు సహకరించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నారు.ఈ మేరకు మంత్రి కేటీఆర్ కార్యాలయానికి అఖిల్ తల్లిదండ్రులు ట్వీట్ చేశారు.దీనిపై స్పందించిన కేటీఆర్.
అఖిల్ మృతదేహాన్ని హైదరాబాద్కు తీసుకొచ్చేందుకు సాయం అందిస్తామని హామీ ఇచ్చారు.వెంటనే రంగంలోకి దిగిన ఆయన కెనడాలోని భారత రాయబార కార్యాలయంతో మాట్లాడారు.
ఇక లాక్డౌన్ సమయంలో అంతర్జాతీయ ప్రయాణాలు నిలిచిపోవడంతో చివరి చూపుకు కూడా నోచుకోని ఘటనలు కొకొల్లలు.పరాయి గడ్డ మీద వున్న వారి పరిస్థితి మరీ దారుణం.
సాధారణ రోజుల్లోనే ఏదైనా దేశంలో భారతీయులు మరణిస్తే.చట్టపరమైన లాంఛనాలన్నీ పూర్తి చేసి మనదేశానికి తీసుకురావడానికి రోజులు పట్టేది.
అదే ఉపాధి కోసం వెళ్లిన నిరుపేదలదీ మరో దీనగాథ.మృతదేహాన్ని స్వదేశానికి పంపిండానికి ఖర్చు చేసేంత స్తోమత వారికి వుండేది కాదు.
ఇండియన్ ఎంబసీ అధికారులో, లేదంటే సామాజిక కార్యకర్తలో తలో చేయి వేస్తే కానీ మార్చురీలో వున్న మృతదేహం అయినవారి వద్దకు చేరేది కాదు.