తెలంగాణలో ఓవర్ స్పీడ్ తో దూసుకు వెళ్తున్న కారు పార్టీ జోరు ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు.అసెంబ్లీ ఎన్నికల ఫలితాల దగ్గర నుంచి జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ టిఆర్ఎస్ జెండా తెలంగాణాలో రెపరెపలాడుతూనే ఉంది.
తాజాగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లోనూ ఎవరూ ఊహించని విధంగా ఫలితాలు సాధించడమే కాకుండా ఆ ఫలితాలతో దేశవ్యాప్తంగా సరికొత్త రికార్డును నెలకొల్పింది.ఈ తరహా ఫలితాలు రావడానికి సీఎం కేసీఆర్ రాజకీయ వ్యూహం బాగా పనిచేసింది.
ఆయనతో పాటు ఆయన కుమారుడు కేటీఆర్ రాజకీయ చతురత బాగా పనిచేసింది.మున్సిపల్ ఎన్నికల బాధ్యతలను స్వీకరించి సమర్థవంతంగా అమలు చేసిన కేటీఆర్ అదే స్థాయిలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాడు.
కేటీఆర్ ముందుచూపుతో ఎక్కడికక్కడ అసంతృప్తులను బుజ్జగించి పార్టీ విజయానికి కృషి చేశారనే ప్రశంసలు అందుతున్నాయి.కేటీఆర్ సమర్థవంతమైన నాయకుడినే విషయాన్ని ప్రతి సందర్భంలోనూ నిరూపించుకున్నాడు కాబట్టి ఆయన త్వరలోనే ముఖ్యమంత్రి పీఠం దక్కుతుందని అంతా అంచనా వేస్తున్నారు.
త్వరలోనే కెసిఆర్ ఈ నిర్ణయాన్ని ప్రకటిస్తారని పెద్దఎత్తున చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.కేటీఆర్ ను సీఎం గా కేసీఆర్ ప్రకటిస్తారని పార్టీ శ్రేణులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.
కేటీఆర్ కు సీఎంగా బాధ్యతలు అప్పగించి తాను జాతీయ రాజకీయాల వైపు వెళ్లాలని కేసీఆర్ చూస్తున్నట్టు వార్తలు కూడా వస్తున్నాయి.కెసిఆర్ మాత్రం కేటీఆర్ కు ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు అప్పగించాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది.
రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత టిఆర్ఎస్ లో ఉప ముఖ్యమంత్రులు లేరు.
తొలి ప్రభుత్వంలో ఇద్దరు ఉండేవారు.వారిలో ఒకరైన రాజయ్య మొదట్లోనే తన పదవికి రాజీనామా చేయగా ఆయన స్థానంలో కడియం శ్రీహరి కి అవకాశం దక్కింది.రెండో వ్యక్తిగా మహమ్మద్ అలీ ఆ పదవిని పొందారు.
అయితే ప్రస్తుత ప్రభుత్వంలో ఆ పదవులు లేవు.దీంతో ముందుగా కేటీఆర్ ను డిప్యూటీ సీఎం చేస్తే బాగుంటుందని, ఆ తరువాత క్రమంగా ఆ బాధ్యతలు అలవాటయ్యాక కేటీఆర్ కు సీఎంగా బాధ్యతలు అప్పగించవచ్చనేది కేసీఆర్ ఆలోచనగా తెలుస్తోంది.
ఈ మేరకు త్వరలోనే కేటీఆర్ కు డిప్యూటీ సీఎం బాధ్యతలు అప్పగించబోతున్నట్టుగా ప్రకటన వెలువడే అవకాశం కనిపిస్తోంది.