తెలంగాణలో ఇప్పుడు రాజకీయ నాయకులు అందరూ పాదయాత్రను ట్రెండ్ గా తీసుకున్నట్లు కనిపిస్తున్నారు.పాదయాత్ర చేపట్టడం ద్వారా వ్యక్తిగత ఇమేజ్ తో పాటు, పార్టీ ఇమేజ్ పెరుగుతుందని, అలాగే తమకు రాబోయే ఎన్నికల్లో డోఖా ఉండదని, ప్రజల్లో తాము ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవచ్చు అనే ఉద్దేశంతో అన్ని పార్టీల నాయకులు పాదయాత్ర ను నమ్ముకుంటున్నారు.
టిఆర్ఎస్ ,బిజెపి ,కాంగ్రెస్, వైఎస్సార్ టీపీ, తీన్మార్ మల్లన్న ఇలా అందరూ పాదయాత్రను చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు.ఒకవైపు హుజురాబాద్ లో ఎన్నికల వేడి కొనసాగుతుండగానే పాదయాత్ర ద్వారా తెలంగాణలో మరింత బలం పెంచుకునేందుకు నాయకులు సిద్ధమైపోతున్నారు .ఆగస్టు 9వ తేదీన బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ రాష్ట్రమంతా పాదయాత్ర చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు.
మాజీ మంత్రి ఈటల రాజేందర్ హుజూరాబాద్ నియోజకవర్గం లో అప్పుడే పాదయాత్ర మొదలు పెట్టారు.
అలాగే కొత్తగా తెలంగాణలో పార్టీ పెట్టిన షర్మిల సైతం తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు.
వైఎస్ షర్మిల కూడా చేవెళ్ల నుంచి పాదయాత్ర చేపట్టేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు.ఈ క్రమంలోనే తెలంగాణ మంత్రులు , బావ బామ్మర్దులు అయిన కేటీఆర్, హరీష్ రావు తెలంగాణలో పాదయాత్ర చేపట్టేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారట.సీఎం కేసీఆర్ సూచనతో వీరు తెలంగాణ అంతటా పర్యటించి టిఆర్ఎస్ కు మరింత ఆదరణ పెరిగేలా చేసేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.
మెదక్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాలో హరీష్ పర్యటించేందుకు ఏర్పాట్లు చేసుకుంటుండగా, నల్గొండ, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాలలో కేటీఆర్ పర్యటించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.ఒకవైపు తెలంగాణలో టిఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలలో ఆదరణ తగ్గుతోందని , వివిధ కారణాలతో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతుండగా, గతంతో పోలిస్తే రాజకీయ శత్రువులు బాగా ఎక్కువ అవడంతో తెలంగాణలో పట్టు చేజారిపోకుండా కేసీఆర్ సూచనలతో కేటీఆర్, హరీష్ రావు విడతల వారీగా తెలంగాణ అంతటా పర్యటించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.రాబోయే రోజుల్లో ఎమ్మెల్యేలు తమ తమ నియోజకవర్గాల్లో పాదయాత్ర చేపట్టి, తమ తమ ప్రభుత్వ ప్రతిష్టను పెంచే పనిలో నిమగ్నం కాబోతున్నట్లు తెలుస్తోంది.