ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ లోని అసంతృప్తి నాయకుల పంట పండుతోంది.అసలే ఇప్పటివరకు అధికారం లో ఉన్న పార్టీ ఏమో డబ్బుకి ఏమాత్రం కొదవలేదు.
అందుకే వారు అడిగిన గొంతెమ్మ కోర్కెలన్నీ తీర్చేస్తూ.తమ సీటుకి ఢోకా లేకుండా చూసుకుంటున్నారు.
ముఖ్యంగా కేసీఆర్ తనయుడు కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గంలో మండలస్థాయి పార్టీ నాయకులు కేటీఆర్ పై గుర్రుగా ఉన్నారట.ఇది పసిగట్టిన కేటీఆర్ వారిని అలాగే వదిలేస్తే తన గెలుపుని ప్రభావితం చేసే అవకాశం ఉందని భావించి వారిని బుజ్జగించే పనిలో పడ్డారు.
తన నియోజకవర్గ నేతలతో హైదరాబాద్ లో సమావేశం ఏర్పాటు చేసి వారి కోరికలన్నీ తీర్చి తాయిలాలు ప్రకటించాడని వార్తలు వినిపిస్తున్నాయి.ఇక గత కొంతకాలంగా .కేటీఆర్, హరీష్ మధ్య వైరం ఉందని చాలా కాలంగా ప్రచారం జరిగింది.అయితే కేసీఆర్ సూచన మేరకు హరీష్-కేటీఆర్ లు కలిసి పోయారు.
సిరిసిల్ల నియోజకవర్గ నేతలను హైదరాబాద్ రప్పించి వారు అడిగినవన్నీ తీర్చి వారిని బుజ్జగించారట.ఇందులో హరీష్ రావుకు చెందిన నమ్మకస్తులైన కార్యకర్తలు కూడా ఉన్నారట.
సిరిసిల్లకు పక్కనే సిద్దిపేట ఉంటుంది.ఇల్లంతకుంట.ముస్తాబాద్ మండలాల్లో హరీష్ రావుకు బలం ఎక్కువ.కానీ ఇవి సిరిసిల్ల నియోజకవర్గ పరిధిలోనివి.
అందుకే హరీష్ ను రప్పించి మరీ తన నియోజకవర్గంలోని అసమ్మతికి కేటీఆర్ తెరదించారని సమాచారం.తాజాగా శనివారం సిరిసిల్ల నియోజకవర్గ నేతలకు ఆ తాయిలాలు అందినట్టు ప్రచారం జరుగుతోంది.
మండల స్థాయి జడ్పీటీసీలు, ఎంపీపీలకు కార్లు బహుమతులుగా వచ్చాయనే ప్రచారం జరుగుతోంది.
ఇక వేములవాడలో పార్టీకి తీవ్ర వ్యతిరేకత ఉన్న దృష్ట్యా వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని కూడా కేటీఆర్ తరహాలోనే మండల నేతలకు ఈ కార్ల బహుమానం ఇచ్చి సంతృప్తిపరిచాడనే ప్రచారం జరుగుతోంది.ఇలా ప్రతి నియోజకవర్గంలోనూ అసంతృప్తి నాయకులను బుజ్జగించే పనిలో పడ్డారు పార్టీ అభ్యర్థులు.ఎంతైనా ఎన్నికల కాలం కదా !
.