కరోనా వైరస్ ప్రజలను ఇబ్బందుల్లోకి నెడుతోంది.కరోనా బారిన పడిన వారికి ప్రభుత్వ ఆస్పత్రుల్లో బెడ్లు దొరకడం లేదు.
కార్పోరేట్ వైద్యం చేయించుకునే స్తోమత లేక పేద, మధ్య తరగతి ప్రజలు నలిగిపోతున్నారు.హోం ఐసోలేషన్ లో ఉందామన్నా ఇంట్లో ప్రత్యేక గదులు లేక ఇబ్బందులు పడాల్సి వస్తోంది.
దీంతో కొంతమంది తమ ఇంటికి దూరంగా పంట పొలాల వద్ద గుడిసెలు వేసుకుని ఉంటున్నారు.అయితే అలాంటి అవకాశం కూడా లేనివాళ్ల పరిస్థితి మరీ దయనీయంగా తయారైంది.
అయితే హోం ఐసోలేషన్ లో ఉండే అవకాశం ఉన్నా వికారాబాద్ కి చెందిన ఓ కరోనా రోగి వింత నిర్ణయం తీసుకున్నాడు.
వికారాబాద్ జిల్లా ధారూరు మండల పరిధిలోని మైలారం గ్రామంలో అశోక్(30) అనే వ్యక్తి భార్యా, పిల్లలతో కలిసి ఉంటున్నాడు.
ఇటీవల అతడు కరోనా బారిన పడ్డాడు.దీంతో హోం ఐసోలేషన్ లో ఉండాలని వైద్యులు అతడికి సూచించారు.
అయితే అశోక్ మాత్రం ఇంట్లో ఉంటే కుటుంబ సభ్యులకు కరోనా వైరస్ వ్యాపిస్తుందేమోనని ఆందోళన చెందాడు.దీంతో ఇంటికి కాస్త దూరంలో నిర్మించుకున్న బాత్రూమ్ నే తన ఐసోలేషన్ రూమ్ గా మార్చుకున్నాడు.
అక్కడే తింటున్నాడు.అక్కడే నిద్రపోతున్నాడు.
ఇదే విషయాన్ని అశోక్ ఓ సెల్ఫీ వీడియోలో చెబుతూ సోషల్ మీడియాలో ఆ వీడియోను పోస్టు చేశాడు.తన పరిస్థితి గురించి అందులో వివరించాడు.ఆ వీడియో జిల్లా వైద్యాధికారుల దృష్టికి వెళ్లడంతో వెంటనే అధికారులు స్పందించి స్థానిక ఎంపీడీవో ద్వారా వివరాలు సేకరించి అనంతగిరి గుట్టలోని ఐసోలేషన్ కేంద్రానికి అతడిని తరలించారు.మైలారం గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ ఈ ఘటనపై మాట్లాడుతూ అశోక్కి రెండు ఇళ్లు ఉన్నాయని చెప్పారు.
అందులో ఒక ఇంట్లో ఐసోలేషన్ లో ఉండమని చెప్పామన్నారు.కానీ అశోక్ కి ఎంత చెప్పినా వినిపించుకోలేదని బాత్ రూమ్ లో ఉంటున్నాడని చెప్పారు.
ఇక ఓ యువకుడు ఇంట్లో ఒక్కటే గది ఉండటంతో చెట్టుపై మంచె ఏర్పాటు చేసుకుని, దాన్నే ఐసోలేషన్ గదిగా మార్చుకున్నాడు.నల్లగొండ జిల్లా అడవిదేవులపల్లి మండలం కొత్తనందికొండ గ్రామానికి చెందిన రమావత్ శివ అనే ఇంజనీరింగ్ స్టూడెంట్ కు ఇటీవల కరోనా సోకింది.లాక్ డౌన్ కారణంగా హైదరాబాద్ నుంచి గ్రామానికి వచ్చిన అతను హమాలీ పనులకు వెళ్తున్నాడు.ఇటీవల కరోనా సోకడంతో ఇంట్లో ఒకే గది ఉండటంతో ఇంటి ఆవరణలోనే చెట్టు మీద మంచె ఏర్పాటు చేసుకుని దాన్నే ఐసోలేషన్ గా మార్చుకున్నాడు.
కుటుంబ సభ్యులు అక్కడికే భోజనం తీసుకొచ్చి అతనికి అందిస్తున్నారు.ఆ యువకుడు అక్కడే తింటూ, నిద్రపోతూ, సెల్ఫోన్ లో వీడియోలు చూస్తూ గడుపుతున్నాడు.