కాంగ్రెస్ పార్టీకి తెలంగాణాలో షాకుల మీద షాకులు తగులుతూనే ఉన్నాయి.కీలక నాయకులు అనుకున్నవారంతా ఇప్పటికే పార్టీని వదిలి వెళ్లిపోవడంతో పార్టీ ఉనికి చాటుకునేందుకు పడరాని పాట్లు పడుతూ ఉంది.
ఇక పార్టీలో మిగిలి ఉన్న నాయకులు కూడా పార్టీని వీడేందుకు చూస్తుండడం ఆ పార్టీ అగ్ర నాయకులకు మింగుడుపడడంలేదు.తాజాగా కొండా సురేఖ దంపతులు పార్టీని వదిలి త్వరలో బీజేపీలో కి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.
గత ఎన్నికల్లో పరకాల నుంచి కాంగ్రెసు తరఫున పోటీ చేసిన కొండా సురేఖ చల్లా ధర్మారెడ్డిపై ఓటమి చెందారు.గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ కీలక నేతలు అంతా ఓటమిపాలయ్యారు.
అయితే లోక్సభ ఎన్నికల్లో మాత్రం మూడు ఎంపీ స్థానాలతో పార్టీ తిరిగి పుంజుకోవడంతో కాంగ్రెస్ లో కొద్దిగా ఆశలు పెరిగాయి.
ఇప్పటికే లోక్సభ ఎన్నికల తర్వాత 12మంది కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్లో చేరిపోయారు.మరి కొంతమంది బీజేపీలో చేరేందుకు చూస్తున్నారు.ఇక కొండా దంపతుల విషయానికి వస్తే తెలంగాణాలో ముందస్తుగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తాము ఓటమి చెందడంతో సైలెంట్ గా ఉంటున్న కొండా దంపతులు బీజేపీలో చేరి మళ్లీ తమ ఉనికి చాటుకోవాలని చూస్తున్నారు.
ఈ నేపథ్యంలో భూపాలపల్లి ఎమ్మెల్యే టికెట్ తమకే కేటాయించాలన్న షరతుపై వీరు బీజేపీలోకి వెళ్తున్నట్టు తెలుస్తోంది.గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొండా దంపతులు ఏపీ విభజన అనంతరం టీఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఇటీవలే జరిగిన ఎన్నికల్లో రెండు టికెట్లు కేటాయించాలని ఆమె పట్టుబట్టారు.
వరంగల్ తూర్పు నుంచి కూతురు సుస్మితా పటేల్ను దింపాలని చూశారు.అయితే టీఆర్ఎస్ విడుదల చేసిన తొలి విడత ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో తన పేరు లేకపోవడంపై అప్పట్లో ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.ఆ తరువాత వారు కాంగ్రెస్ లో చేరిపోయారు.
ప్రస్తుతం బీజేపీ రాజకీయంగా బలపడుతుండడం రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ కు ప్రత్యామ్న్యాయంగా బీజేపీ తెలంగాణాలో అధికారం చేపట్టే అవకాశం ఉండడంతో వీరు కూడా బీజేపీలోకి వెళ్లేందుకు చూస్తున్నారు.వీరితో పాటు గత ఎన్నికల్లో భూపాలపల్లి నుంచి పోటీ చేసి ఓడిపోయిన గండ్ర సత్యనారాయణ కూడా బిజెపిలో చేరనున్నట్టు వార్తలు వస్తున్నాయి
.