తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా విజృంభిస్తుంటే ఇటువంటి క్లిష్ట సమయంలో నేతలు రాజకీయ దుమారాన్ని రేపారు.వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ పై భూ కుంభకోణం అంటూ తెగహడావుడి చేస్తున్నారు.
ఈ నేపధ్యంలో ఈటల రాజేందర్కు మద్దతుగా ఇతర పార్టీ నేతలే కాకుండా, సొంత పార్టీ నేతలు కొందరు ముందుకు వస్తున్నారు.ఈ ఆరోపణల పై సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు.
ఈ క్రమంలోనే మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కూడా తెలంగాణలో హెల్త్ ఎమర్జెన్సీ ఉంటే సీఎం కేసీఆర్ పొలిటికల్ ఎమర్జెన్సీపై దృష్టి పెట్టారని విమర్శలు గుప్పిస్తున్నారు.
కేటీఆర్ను సీఎం చేయటానికే ఈటలను బయటకు పంపే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తూ ఎక్కడ ఈటల రాజేందర్ అడ్డుతగులుతారనే భయంతో ఈ భూ కబ్జా కుట్రను వెలుగులోకి తెచ్చారని సంచలన వ్యాఖ్యలు చేశారు.ఇకపోతే ఇప్పటికే మంత్రి మల్లారెడ్డి పైనే కాకుండా ఇతర టీఆర్ఎస్ నేతల పై కూడా ఎన్నో భూకబ్జా ఆరోపణలు ఉండగా కేవలం ఈటలనే టార్గెట్ చేయడం వెనక ఉన్న కుట్రను ఇప్పటికైనా టీఆర్ఎస్లో ఉన్న ఉద్యమకారులు గ్రహించాలని తెలిపారు.
రాష్ట్రంలో కరోనా విస్తరిస్తున్న తరుణంలో వైద్యారోగ్యశాఖకు అధిక నిధులు ఇచ్చి ప్రజల ప్రాణాలు కాపాడాల్సింది పోయి స్వలాభం కోసం నీచ రాజకీయం చేస్తూ ఈటలను బలిపశువును చేస్తే టీఆర్ఎస్ పార్టీలో చీలిక తప్పదని అన్నారు.