తెలంగాణలో రాజకీయ పార్టీ పెడుతున్న షర్మిల ఆ పార్టీ పేరు ప్రకటించకుండానే ఎన్నో సంచలనాలు సృష్టిస్తున్నారు.తెలంగాణ వ్యాప్తంగా ఉన్న వైఎస్ అభిమానులు అందరినీ ఏకం చేసి, టిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్ లకు ధీటుగా తన పార్టీని బలోపేతం చేసి, అధికారం సాధించే దిశగా అడుగులు వేయాలని చూస్తున్నారు.
ముఖ్యంగా తెలంగాణలో రాజకీయంగా యాక్టివ్ గా ఉన్న రెడ్డి సామాజిక వర్గం నేతలు అందరినీ ఏకం చేసి తమ పార్టీలోకి తీసుకురావాలని, అలాగే ఉద్యోగస్తులు, విద్యార్థులు, విద్యావంతులు, మహిళలు, కర్షకులు, కార్మికులు ఇలా అన్ని వర్గాల ప్రజల మద్దతు కూడగట్టుకుని ముందుకు వెళ్లాలని చూస్తున్నారు.ఏప్రిల్ తొమ్మిదో తేదీన పార్టీ పేరును ప్రకటించే ఏర్పాట్లను షర్మిల చేసుకుంటున్నారు.
ఇక ఆ తరువాత తెలంగాణ అంతటా పాదయాత్ర చేపట్టి గ్రామ స్థాయికి తన పార్టీని తీసుకువెళ్లి, రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో సక్సెస్ కావాలని చూస్తున్నారు.ఈ మేరకు త్వరలోనే గ్రామ స్థాయిలో కమిటీలను వేసేందుకు సిద్ధమవుతున్నారు.
ఇదిలా ఉంటే షర్మిల కొత్త పార్టీ ఏర్పాటుపై అందరికంటే ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ కంగారు పడుతోంది.రెడ్డి సామాజిక వర్గం ఎక్కువగా కాంగ్రెస్ లోనే ఉండడం, రోజురోజుకు పార్టీ బలహీనంగా ఉండడం, రాజకీయ ప్రత్యామ్నాయం కోసం చూస్తున్న వారంతా షర్మిల పార్టీ వైపు మొగ్గు చూపడం వంటి కారణాలతో తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి వంటివారు షర్మిల ను పూర్తిగా టార్గెట్ చేసుకుంటూ, విమర్శలు చేస్తున్నారు.అయితే రేవంత్ తో పాటు షర్మిల కు గట్టి పోటీ ఇచ్చే విధంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మరో లేడీ ఫైర్ బ్రాండ్ ను రంగంలోకి దించాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోందట.అది కూడా వైఎస్ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితురాలిగా ముద్రపడిన మాజీ మంత్రి కొండా సురేఖనే షర్మిల కు పోటీగా దించాలని, షర్మిల పాదయాత్ర కు పోటీగా తెలంగాణ అంతటా కొండా సురేఖ తో పాదయాత్ర చేస్తే మంచి ఫలితం ఉంటుంది అనే ఆలోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్ట సమాచారం.
సురేఖతో పాదయాత్ర చేయించడం ద్వారా షర్మిల కు గట్టి పోటీ ఇవ్వడమే కాకుండా, తెలంగాణ కాంగ్రెస్ కు మంచి ఊపు తీసుకొచ్చినట్టు అవుతుందని అధిష్టానం పెద్దలు భావిస్తున్నారట.ఇప్పటికే రాహుల్, ప్రియాంక గాంధీ లు పూర్తిగా కాంగ్రెస్ కు పునర్వైభవం తీసుకు వచ్చే పనిలో నిమగ్నమయ్యారు.
దీనికి తోడు జాతీయ స్థాయిలో బీజేపీ పై ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకత కారణంగా కాంగ్రెస్ కు ఆదరణ పెరుగుతున్నట్లు కనిపిస్తుంది.వీటన్నిటిని లెక్కలు వేసుకునే కొండా సురేఖ ను యాక్టివ్ చేసే ఆలోచనలో అధిష్టానం ఉందట.
అవసరమైతే ఆమెకు పార్టీ పరంగా కీలకమైన పదవిని కట్టబెట్టేందుకు అధిష్టానం పెద్దలు మొగ్గు చూపిస్తున్నారు.కానీ వైఎస్ కుటుంబానికి సన్నిహితురాలు గా ముద్రపడిన సురేఖ షర్మిల పై విమర్శలు చేసేందుకు ముందుకు వస్తారా అనేది అందరికీ సందేహంగా మారింది.