తెలంగాణ లో పార్టీ స్థాపించిన దగ్గర నుంచి జనాల్లోకి పార్టీని తీసుకువెళ్లేందుకు ఆ పార్టీ అధినేత్రి షర్మిల ఎంతగానో ప్రయత్నాలు చేస్తున్నారు.అలాగే పెద్ద ఎత్తున కీలక నాయకులను ఇతర పార్టీల నుంచి చేర్చుకుని తమ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ఆమె ఎంతగానో ప్రయత్నాలు చేస్తున్నారు.అయితే ఆశించిన స్థాయిలో అయితే చేరికలు కనిపించకపోగా, పార్టీలో ఉన్న కీలక నాయకులు ఒక్కొక్కరు బయటకు వెళ్ళిపోతూ ఉండడం షర్మిలకు మరింత తలనొప్పి తీసుకొస్తోంది.2023 ఎన్నికల్లో నాటికి ఏదో విధంగా తమ పార్టీ ఉనికి చాటాలని షర్మిల ప్రయత్నాలు చేస్తున్నారు.
దీనిలో భాగంగానే అధికార పార్టీ టిఆర్ఎస్ ను టార్గెట్ చేసుకుంటూ అదేపనిగా విమర్శలు చేస్తున్నారు.ఈ వ్యవహారాలు ఇలా ఉంటే పార్టీలో షర్మిల తరువాత కీలకంగా వ్యవహరిస్తున్న కొండా రాఘవ రెడ్డి గత కొంత కాలంగా పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటుండడంతో, ఆయన పార్టీకి దూరమవుతున్నారనే సంకేతాలు వెలువడుతున్నాయి.
షర్మిల వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించే సమయంలోనూ అంతకు ముందు ఆమె తరఫున, పార్టీ తరఫున అధికార ప్రతి నిధిగా కొండా రాఘవరెడ్డి వ్యవహరించేవారు.పార్టీకి సంబంధించిన అన్ని వ్యవహారాలను ఆయన చూసుకునే వారు.
షర్మిల తీసుకునే నిర్ణయాలు, పార్టీ పరంగా తీసుకునే నిర్ణయాలలోను కొండా రాఘవరెడ్డి మార్క్ కనిపించేది.అయితే గత కొంత కాలంగా రాఘవరెడ్డి కి సరైన ప్రాధాన్యం పార్టీలు దక్కకపోవడం, వైఎస్ రాజశేఖర రెడ్డి సన్నిహితులతో ను షర్మిల సన్నిహితంగా ఉండడం వంటి వ్యవహారాలు రాఘవ రెడ్డి కి ఆగ్రహాన్ని కలిగిస్తున్నాయట.
ఈ నేపథ్యంలోనే ఆయన పార్టీ కార్యక్రమాలకు కాస్త దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది.అయితే ఇప్పటికే పార్టీలో కీలక నాయకులు అనుకున్న వారు అంతా దూరం కావడం, చేరికలు అంతంత మాత్రంగానే ఉండడంతో రాఘవరెడ్డి కూడా ఈ సమయంలో బయటకు వెళ్లి పోతే పార్టీ కేడర్ లో తప్పుడు సంకేతాలు వెళ్తాయి అనే ఉద్దేశంతో నష్టనివారణ చర్యలకు దిగినట్లు సమాచారం.ఈ మేరకు వైఎస్ షర్మిల తల్లి విజయమ్మ కొండా రాఘవరెడ్డి తో చర్చించేందుకు సిద్ధమయ్యారట.ఈ మేరకు రాఘవ రెడ్డి కి సమాచారం పంపినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.