మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ తోనే నడుస్తూ ఆ పార్టీలో ఎన్నో కీలక పదవులు అనుభవించిన కోమటిరెడ్డి బ్రదర్స్ వెంకట్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు రాజకీయంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో పట్టు కోల్పోవడంతో వీరికి క్రమక్రమంగా ప్రాధాన్యత తగ్గుతూ వస్తోంది.
భువనగిరి ఎంపీ గా ఉన్న వెంకట్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకుడిగా ఉన్నారు.ఇక రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యే గా ఉన్నారు.
కాంగ్రెస్ తెలంగాణలో బలపడే అవకాశం లేకపోవడంతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గతంలోనే బీజేపీలో చేరబోతున్నాను అంటూ ప్రకటించి సంచలనం సృష్టించారు.అయినా అటువైపు నుంచి అడుగులు పడలేదు.
వెంకట్ రెడ్డి సైతం కాంగ్రెస్ అధిష్టానంపై గుర్రుగానే ఉంటూ వస్తున్నారు.ముఖ్యంగా రేవంత్ రెడ్డి విషయంలో కాంగ్రెస్ అధిష్టానం ఆయనకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం, తమకు ప్రాధాన్యం తగ్గించడం వంటి వ్యవహారాలతో బ్రదర్స్ ఇద్దరూ తీవ్ర అసంతృప్తితోనే ఉన్నారు.
పార్టీ అధిష్టానం తమకు ఎప్పటికైనా ప్రాధాన్యం ఉన్న పదవులు అప్పగిస్తుంది అని ఆశగా ఎదురు చూస్తున్నారు.ముఖ్యంగా పిసిసి అధ్యక్ష పదవి విషయంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి భారీగానే ఆశలు పెట్టుకున్నారు.
ఆ పదవి ఇస్తే అన్ని వర్గాల ప్రజలనూ కలుపుకుని వెళ్తామని, ఎలాగూ సీనియర్ నాయకులతో తమకు సఖ్యత ఉన్న నేపథ్యంలో తెలంగాణ అంతటా పాదయాత్ర నిర్వహించి, పార్టీని అధికారంలోకి తీసుకురాగలమనే నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేస్తూ, అధిష్టానం పెద్దల వద్ద ఒత్తిడి పెంచుతున్నారట.అయినా కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ వైపు మొగ్గు చూపుతున్న నేపథ్యంలో, బ్రదర్స్ ఇద్దరూ టిఆర్ఎస్ లో చేరితే రాజకీయ సమీకరణాలు ఎలా ఉంటాయి అనే విషయంపైనా ఆలోచిస్తున్నట్లు సమాచారం.
అసలు బిజెపి వైపు ముందుగా బ్రదర్స్ వెళ్లేందుకు చూసినా, ప్రస్తుతం దేశవ్యాప్తంగా బీజేపీ వ్యతిరేకత ఎదుర్కోవడం, పెట్రోల్, గ్యాస్ ధరల పెరుగుదల వంటివి ప్రజల్లో బీజేపీపై ఆగ్రహం కలిగే విధంగా చేయడం ఇలా అనేక పరిణామాలతో బిజెపిలో చేరడం అంత కరెక్ట్ కాదనే ఆలోచనతో వీరు ఉన్నారట.అందుకే టిఆర్ఎస్ ను ఇప్పుడు ఒక ఆప్షన్ గా పెట్టుకున్నారట.అయితే టిఆర్ఎస్ లో కానీ, బిజెపి లో గాని ఇప్పట్లో వెళ్లే అవకాశం లేదని, పిసిసి అధ్యక్ష పదవిపై అధిష్టానం నిర్ణయం ఏ విధంగా ఉంటుందో చూసి ఆ తర్వాత రాజకీయంగా సంచలన నిర్ణయమే తీసుకునేందుకు బ్రదర్స్ ఇద్దరూ రెఢీ అవుతున్నారట.