రోజుకో మలుపు .గంటకో బ్రేకింగ్ న్యూస్ ! ఇది ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలు ! ముందస్తు ఎన్నికల వేడి నాయకుల్లో తెగ కంగారు పుట్టిస్తోంది.
పార్టీలు తీసుకుంటున్న నిర్ణయాలు నాయకులకు నచ్చక .నాయకుల తీరు పార్టీలకు నచ్చక ఇలా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.ఎప్పుడు ఏ నాయకుడు అలకబూనుతాడో .తెలియని పరిస్థితి నెలకొంది.తాము కోరిన కోరికలు నెరవేర్చకపోతే వెంటనే పార్టీపై విరుచుకుపడడం .పక్క పార్టీల్లో తమకు ఆ అవకాశం కనుక వస్తే వెంటనే ముందు వెనుక ఆలోచించకుండా పార్టీ మారిపోవడం ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్ లో కామన్ అయిపొయింది.
తెలంగాణా కాంగ్రెస్ పార్టీలో ఒక వెలుగు వెలిగిన కోమటి రెడ్డి బ్రదర్స్ పార్టీలో తమకు తగిన ప్రాధాన్యం దక్కడంలేదని నిరాశలో ఉన్నారు.ఇప్పటివరకు ఆశ్రయమిచ్చిన కాంగ్రెస్ను కాదని కారు ఎక్కడానికి ముహూర్తం చూసుకుంటున్నట్టుగా కాంగ్రెస్ లో ఒకటే గుసగుసలు వినిపిస్తున్నాయి.ఎందుకంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్లో తీవ్ర దుమారం రేపాయి.రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్పై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇటీవలే తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
ఎన్నికల కమిటీల నియామకాన్ని తప్పుబట్టడమే కాకుండా ప్రజల కోసం కష్టపడే నేతలకు టిక్కెట్లు ఇస్తేనే పార్టీ గెలుస్తుందని.గాంధీ భవన్లో ప్రెస్మీట్లు పెట్టినంత మాత్రాన కాంగ్రెస్ అధికారంలోకి రాదని సంచలన వ్యాఖ్యలు చేసాడు.
ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించడమేనని, టి.కాంగ్రెస్ క్రమశిక్షణ సంఘం అభిప్రాయపడడమే కాకుండా వారికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది.24 గంటల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.కానీ గడువు ముగిసింది.
ఆయన ఎలాంటి సమాధానం చెప్పకపోవడంతో కాంగ్రెస్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందనే ప్రచారం జోరుగా సాగుతోంది.కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై అధిష్టానం కూడా సీరియస్గా ఉన్నట్లు తెలుస్తోంది.
ఆయనపై వేటు వేస్తారనే ప్రచారం జరుగుతోంది.కానీ కొంతమంది సీనియర్లు మాత్రం ఇప్పుడే తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దని సూచిస్తున్నారు.
కానీ ఈ వ్యవహారం ఇంతదూరం వెళ్ళాక ఇక పార్టీలో ఉండడం మంచిది కాదని ఈ బ్రదర్స్ ఇద్దరు డిసైడ్ అయ్యారట.అందుకే టీఆర్ఎస్ లో చేరేందుకు ఆ పార్టీ అగ్రనాయకులతో సంప్రదింపులు చేస్తున్నట్టు సమాచారం.