వైసీపీ నేత హత్య కేసులో మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు కృష్ణా జిల్లా కోర్టు షాకిచ్చింది.కొల్లు రవీంద్ర దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది.
మచిలీపట్నానికి చెందిన వైసీపీ నేత మోకా భాస్కరావు హత్య కేసులో కొల్లు రవీంద్ర ఏ4 నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే.ఈ కేసులో బెయిల్ కోరుతూ కొల్లు రవీంద్ర కృష్ణా జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది.కొల్లు రవీంద్ర బయటికి వస్తే ఈ కేసుకు సంబంధించిన అంశాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ) వాదనతో జిల్లా కోర్టు ఏకీభవించింది.
దీంతో కొల్లు రవీంద్రతో పాటు మిగతా నిందితులకు కూడా బెయిల్ ను నిరాకరించింది.
ఈ ఏడాది జూన్ 29న మచిలీపట్నం చేపల మార్కెట్ వద్ద వైసీపీ నేత మోకా భాస్కరరావు దారుణంగా హత్యకు గురైన సంగతి తెలిసిందే.
ఈ కేసులో చింతా నాంచారయ్య (చిన్ని), చింతా నాంచారయ్య (పులి), చింతా నాగమల్లేశ్వరరావు, చింతా వంశీకృష్ణ, పోల రాము, ధనలతో పాటు ఓ మైనర్ ను అరెస్టు చేశారు.ఈ కేసులో కొల్లు రవీంద్రను కుట్రదారుడిగా పేర్కొంటూ ఏ-4 నిందితుడిగా అరెస్ట్ చేశారు.
కొల్లు రవీంద్ర నిందితులకు సహకరించారనే ఆరోపణలు ఉన్నాయి.ప్రస్తుతం ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.