భారతీయ క్రికెట్ జట్టుకి గత ఐదారు రోజులుగా కలిసి రావడం లేదు.ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లో పాకిస్తాన్ చేతిలో దారుణమైన పరాభావాన్ని రుచి చూడటంతో ఇప్పటికే అభిమానులు ఆగ్రహావేశం వ్యక్తం చేస్తున్నారు.
టాస్ గెలిచిన కొహ్లీ మొదట బౌలింగ్ ఎంచుకొని తప్పు చేసాడని, అదే కొంప ముంచిందని, కోహ్లిని కెప్టెన్ గా తీసేసి తిరిగి ధోనినే నియమించాలని ఇప్పటికే వాదనలు వినిపిస్తుండగా, తాజాగా అనిల్ కుంబ్లే వివాదం కోహ్లిని మరింత పెద్ద విలన్ ని చేసింది.గత ఏడాదికాలంగా భారత క్రికెట్ జట్టుకి హెడ్ కోచ్ గా సేవలందిస్తున్న అనీల్ కుంబ్లే, తన కోచ్ పదవిని పొడిగించవద్దని, తాను ఈ జట్టుతో ఇక కొనసాగలేనని తేల్చి చెప్పడమే కాదు, పబ్లిక్ లో ట్వీట్ వేసి, తనకి – కోహ్లికి మధ్య మనస్పర్థలు ఉన్న మాట వాస్తవమేనని, జట్టు సారథితో విభేదాలు పెట్టుకొని తాను కోచ్ గా పనిచెయలేనని గట్టిగా చెప్పాడు.
దాంతో కోహ్లి మీద మళ్ళీ తిట్ల దండకం అందుకున్నారు జనాలు.
అనీల్ కుంబ్లే లాంటి దిగ్గజాన్ని కోహ్లి కించపరిచాడని, కేవలం ఆటగాడిగా టాప్ లో ఉండటమే కాదు, తమకన్నా ముందు దేశ క్రికెట్ కి సేవలందించిన వారిని కూడా గౌరవించడం నేర్చుకోవాలని పలువురు మాజీ ఆటగాళ్ళు కూడా కోహ్లి మీద కదం తొక్కారు.
అసలు కోహ్లికి కుంబ్లేకి మధ్య గొడవ ఇప్పటిది కాదు అని టాక్.ఇద్దరు ఐపిఎల్ లో ఒకే జట్టు తరఫున కలిసి ఆడారు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో కోహ్లి ఇంకా కొనసాగుతుండగా, కుంబ్లే ఎప్పుడో రిటైర్ మెంట్ ప్రకటించి, మళ్ళీ అదే జట్టుగా కోచింగ్ ఇచ్చాడు.కాని అక్కడ కూడా కుంబ్లే ఉండలేకపోయాడు.
అక్కడ కూడా కోహ్లితో వివాదాలే కుంబ్లే పదవిని పోగొట్టాయేమో.కుంబ్లే మాత్రమే కాదు, కుంబ్లేకి ముందు రాయల్ ఛాలెంజర్స్ కి కోచ్ గా పనిచేసినవాడిది ఇదే పరిస్థితి.
కోహ్లి చెబితేనే తీసేసారట.ఈసారి అంత దూరం వెళ్ళనివ్వకుండా, తానే తప్పుకుంటున్నట్లు ప్రకటించేసాడు కుంబ్లే.
మరి ఈ వివాదంలో దోషి కోహ్లీ ఒక్కడేనా? మిగితా ఆటగాళ్ళతో కుంబ్లేకి సత్సంబంధాలు ఉన్నాయా ? కోహ్లీ ఎలాగో కుంబ్లే మీద పిచ్చి కోపంతో ఉన్నాడు.మరి ధోని, యువరాజ్, పాండ్య, రహానే .వీళ్ళంతా ? కుంబ్లే తప్పుకుంటున్నట్లు చెప్పిన తర్వాత జట్టులోని ఒక్క ఆటగాడు కూడా మీ సేవలకు ధన్యవాదాలు అంటూ మాటవరసకి కూడా స్పందించలేదు.అంటే మిగితా ఆటగాళ్ళతో కూడా కుంబ్లేకి విభేదాలు ఉన్నట్లే కదా.మరి మీడియా కోహ్లీ వైపునుంచి ఆలోచించకుండా, కనీసం ఏం జరిగిందో తెలుసుకోకుండా, విరాట్ ఒక్కడినే విలన్ ని చేసింది.
ప్రస్తుతం విండీస్ టూరుకి కోచ్ లేకుండానే బయలుదేరిన భారతజట్టుకి అతి త్వరలో కొత్త కోచ్ వస్తాడు.
ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు టామ్ మూడి, భారత మాజీ ఓపెనర్ విరేందర్ సెహ్వాగ్ ఇద్దరు ప్రధానంగా బరిలో ఉన్నారు.కొత్త కోచ్ ని ఇంటర్వ్యూ చేసి నిర్ణయించాల్సిన బాధ్యత సచిన్, గంగూలి, లక్ష్మణ్ లది.ఇందులో గంగూలి నిర్ణయం కీలకం అవొచ్చు ఏమో.ప్రస్తుత పరిస్థితుల్లో టామ్ మూడికే కోచ్ పదవి దక్కొచ్చు.ఎందుకంటే ఈయనకి ఒకప్పుడు శ్రీలంకని, ఇప్పుడు ఐపిఎల్ జట్టు సన్ రైజర్స్ హైదరాబాద్ ని విజయాల బాట పట్టించిన అనుభవం ఉంది.