వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మాజీ స్పీకర్ కోడెల శివ ప్రసాద్ రావు మీద వరుస వరుసగా రివేంజ్ లు స్టార్ట్ అయ్యాయి.ఇప్పటికే ఆయన కొడుకు, కూతురు మీద ఉన్న పాత కేసులను తిరగతోడడడంతో పాటు కొత్త కొత్త కేసులను నమోదు చేయించింది.
అంతే కాదు కోడెల శివ ప్రసాద్ రావు ఫ్యామిలీ వల్ల ఇబ్బందులుపడ్డ వారందరికీ ధైర్యం చెబుతూ వారికి మద్దతుగా నిలుస్తున్నారు.గత ప్రభుత్వంలో వైసీపీ మీద అనేక కక్షపూరిత చర్యలు తీసుకోవడంతో పాటు అసెంబ్లీ లో కూడా ఇలాగే వ్యవహరించారని వైసీపీ వాదన.
అందుకే ఇప్పుడు ఆయనకు వ్యతిరేకంగా ఏ చిన్న విషయం దొరికినా అది తమకు అనువుగా ఉండేలా చూసుకుంటోంది.తాజాగా కోడెలకు సంబంధించి వైసీపీ ఓ కీలక సమాచారం రాబట్టింది.
దాని ద్వారా ఆయన్ను ఇరికించేందుకు చూస్తోంది.
ఇంతకీ విషయం ఏంటి అంటే హైదరాబాద్లోని పాత, కొత్త శాసన సభ్యుల నివాస ప్రాంగణం న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ ఉన్నాయి.ఈ భవనాలను ఆంధ్రప్రదేశ్కు చెందిన శాసనసభ్యులకు కూడా నివాసం ఉండేందుకు విభజన చట్టం ప్రకారం వెసులుబాటు కేంద్ర ప్రభుత్వం కల్పించింది.ఆ మేరకు ఏపీకి చెందిన కొంతమంది శాసన సభ్యులు, అలాగే కొంతమంది శాసన మండలి సభ్యులు కూడా వీటిలో నివాసం ఉంటున్నారు.
క్వార్టర్స్ను ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేటాయించే అధికారం స్పీకర్కు మాత్రమే ఉంటుంది.ఆ అధికారాన్ని ఉపయోగించుకుని అప్పటి స్పీకర్ కోడెల శివప్రసాద్, అవినీతికి పాల్పడ్డారని వైసీపీ ఆరోపణలు చేస్తోంది.
రాష్ట్ర విభజన జరిగిన దగ్గర నుంచి ఏపీ శాసనసభ సభ్యులు అమరావతికి పరిమితం అయ్యారు.దీంతో ఖాళీగా ఉన్న భవనాలను ప్రైవేటు వ్యక్తులకు కోడెల అనుచరులు ద్వారా కట్టబెట్టారని వైసీపీ ఆరోపిస్తోంది.
తన వ్యక్తిగత కార్యదర్శి, అదే కార్యాలయంలో ఔట్ సోర్సింగ్ సిబ్బందిగా పని చేసిన మరో ఉద్యోగి కలిసి అప్పటి అసెంబ్లీ కార్యాలయంలో కీలకమైన అధికారి సహకారంతో దాదాపు 20కిపైగా ఎమ్మెల్యే క్వార్టర్స్ను ప్రైవేట్ వ్యక్తులకు అద్దెకు ఇచ్చారని వైసీపీ వాదన.ఇలా ఒక్కో ఎమ్మెల్యే క్వార్టర్ను అద్దెకు ఇచ్చి, దాని ద్వారా నెలకు ఒక్కో ఇంటికి 20 వేల రూపాయల చొప్పున వసూలు చేసినట్టు వైసీపీ చెబుతోంది.
ఐదేళ్ల పాటు ఈ అద్దె సొమ్ములను కోడెల తన జేబులో వేసుకున్నట్టు, దీనిపై విచారణ చేయాలని వైసీపీ పట్టుబడుతోంది.ఇదంతా ఏపీకి సంబందించిన భవనాలను తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించడంతోనే ఈ స్కామ్ బయటపడినట్టు వైసీపీ చెబుతోంది.
దీనిపై కోడెలపై కేసు నమోదు చేయించాలనే పట్టుదలతో వైసీపీ ఉంది.