మొదటి నుంచి ఏపీ రాజధాని వ్యవహారం పెద్ద తలనొప్పిగా మారుతూనే వస్తోంది.గత టీడీపీ ప్రభుత్వంలో అమరావతి రాజధానిగా ప్రతిపాదించి, ఆ మేరకు అక్కడ అన్ని ఏర్పాట్లు చేయడంతో పాటు, ప్రభుత్వ కార్యాలయాలను తరలించడం, హైకోర్టు నిర్మాణం , అసెంబ్లీ, ఇలా ఎన్నో నిర్మాణాలు పూర్తి చేశారు.
ఇక ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఒక్కసారిగా సీన్ మారిపోయింది.అమరావతి రాజధానిని చేసేందుకు వైసీపీ ప్రభుత్వం ఇష్ట పడకపోగా, మూడు రాజధానులు అంటూ కొత్త ప్రతిపాదన తీసుకు వచ్చి అమరావతి లో శాసన రాజధాని, విశాఖలో పరిపాలనా రాజధాని కర్నూల్ లో హైకోర్టు ప్రతిపాదించింది.
దీనిపై పెద్ద వివాదం కొనసాగుతుండగానే, ఇప్పుడు అమరావతి శాసన రాజధానిగా కూడా వద్దు అంటూ, ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇదే విషయాన్ని ఏపీ సీఎం జగన్ తోనూ చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని కొడాలి నాని అన్నారు.అలాగే అన్ని రాజకీయ పార్టీలతోనూ ఈ ఈ విషయంపై పూర్తి స్థాయిలో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటానని జగన్ చెప్పినట్లు గా వెల్లడించారు.అమరావతి ప్రాంతంలో సుమారు 55 వేల మంది పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే, అమరావతి ప్రాంతానికి చెందిన రైతులు, టీడీపీ నాయకులు కోర్టుల్లో కేసు వేసి అడ్డుకుంటున్నారని, పేదలకు అమరావతి ప్రాంతంలో ఉండేందుకు తగిన అవకాశం లేనప్పుడు, ఇక్కడ రాజధాని ఎందుకు అంటూ నాని వ్యాఖ్యానించారు.
అందుకే ఇక్కడ నుంచి శాసన రాజధానిని తరలించాలని చూస్తున్నట్టుగా నాని చెప్పారు.నాని వ్యాఖ్యలపై ఇప్పుడు పెద్ద దుమారమే రేగుతోంది.జగన్ మనసులో మాటను నానితో చెప్పించారు అంటూ ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.ఒకవేళ ఇదే విషయం జగన్ కూడా చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారా అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఏది ఏమైనా అమరావతి వ్యవహారం మొదటి నుంచి రాజకీయ విమర్శలకు వేదికగానే మారుతూ వస్తోంది.