ప్రపంచంలో నేరాలు అతి తక్కువగా నమోదయ్యే దేశాలలో జపాన్ ఒకటి.అయితే అలాంటి జపాన్ లో ఒక దుండగుడు కత్తి తో వీరంగం సృష్టించాడు.
కత్తితో అనేక మందిపై విచక్షణారహితంగా దాడికి పాల్పడినట్లు తెలుస్తుంది.జపాన్ లోని కవాసకి నగరంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
జపాన్ కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం7:44 గంటలకు చోటుచేసుకున్న ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు మృతి చెందగా,మరో 17 మంది తీవ్రంగా గాయపడినట్లు అక్కడి అధికారులు తెలిపారు.గాయపడిన వారిలో కూడా ఎక్కువమంది చిన్నారులే ఉన్నట్లు సమాచారం.
పాఠశాలకు వెళ్లేందుకు బస్ స్టాప్కు వచ్చిన విద్యార్థులే లక్ష్యంగా ఆ దుండగుడు దాడికి దిగాడని ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు.పలువురిపై విచక్షణా రహితంగా దాడికి పాల్పడిన ఆ ఆగంతకుడు అనంతరం నిందితుడు తనని తాను పొడుచుకొని ఆత్మహత్యాయత్నానికి కూడా పాలపడినట్లు తెలుస్తుంది.
ఈ ఘటన సమాచారం అందుకున్న వెంటనే భద్రతా బలగాలు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకొని గాయపడిన క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.ప్రస్తుతం దుండగుడు పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తుంది.అసలు అతడు ఎందుకు ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడు అన్న వివరాలు మాత్రం తెలియరాలేదు.జపాన్ దేశం అనేది ప్రపంచంలో నేరాలు అతితక్కువగా నమోదయ్యే దేశం అయినప్పటికీ 2016 లో ఒకసారి, 2018 లో ఒకసారి ఇలాంటి దాడుల ఘటనలు చోటుచేసుకున్నాయి.2016 లో ఒక దుండగుడు మానసిక రుగ్మతల తో బాధపడుతున్న 19 మందిని పొట్టన పెట్టుకోగా, 2018 ఒక వ్యక్తి తన సహచరుణ్ణి కత్తితో పొడిచి చంపాడు.