ప్రస్తుతం డిజిటల్ యుగంలో ఆన్లైన్ మోసాలు పెచ్చరిల్లుతున్నాయి.ఎన్ని జాగ్రత్తలు చెప్పినా ఎప్పటికప్పుడు అమాయకులు సైబర్ కేటుగాళ్ల బారిన పడుతూనే ఉన్నారు.
తాజాగా ఆన్లైన్ సంస్థ అయిన కే.ఎన్.సీ చైన్ యాప్ ను నమ్మి వందలాది మంది ప్రజలు మోసపోయారు.ఈ యాప్ కి సంబంధించిన మోసాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.
మొదట 2 నెలలపాటు యూజర్లకు లాభాలను అందించిన ఈ యాప్ నిర్వాహకులు అధిక మొత్తంలో డబ్బు జమయ్యాక లాభాలు ఇవ్వడం అటుంచితే.అసలు మొత్తం కూడా కాజేసి బోర్డు తిప్పేశారు.
తొలుత రెండు నెలల పాటు కొందరు యూజర్లకు ప్రాఫిట్స్ ఇచ్చి ఎక్కువ మంది ప్రజలను తమ వలలో వేసుకున్నారు ఈ మోసగాళ్లు.
పోలీసుల కథనం ప్రకారం, విజయనగరం జిల్లా వ్యాప్తంగా వందలాది మంది ప్రజలు ఆన్లైన్ సంస్థను నమ్మి నిలువునా మోసపోయారు.
సాలూరు మండలంలోని మరిపల్లి గ్రామంలో కొందరు యువతీ యువకులు 2021 నవంబరు నెలలో కేఎన్సీ చైన్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకున్నారు.ఈ యాప్ లో కొంత డబ్బులు పెడితే అవి రెట్టింపు అవుతాయని బొబ్బిలిలో చదువుతున్న ఓ విద్యార్థి వీళ్లకు చెప్పాడట.
అలా మరిపల్లి గ్రామస్తులు ఈ యాప్ లో మనీ ఇన్వెస్ట్ చేశారు.ఇదే సమయంలో డబ్బులు పెట్టుబడి పెడితే 48 రోజుల్లో 10 రెట్ల అధికంగా డబ్బు వస్తుందని యాప్ నిర్వాహకులు నమ్మబలికారు.
ఈ మాట ఆ నోటా ఈ నోటా పడి మిగతా వారు కూడా దురాశతో ఇందులో డబ్బులు జమ చేశారు.
అయితే మొదట్లో పెట్టిన పెట్టుబడి కంటే ఎక్కువ రాబడి కనిపించడం తో మరింత ఎక్కువ డబ్బులను ఇందులో జమ చేయడం ప్రారంభించారు ప్రజలు.2021 జనవరి, డిసెంబర్ నెలల్లో యాప్ లో విపరీతంగా పెట్టుబడులు పెట్టారు.ఈ క్రమంలో కొత్త సంవత్సరం సందర్భంగా ప్రత్యేక ఆఫర్లు ఇస్తున్నామంటూ యాప్ నిర్వాహకులు మరింత మందిని ఆకట్టుకున్నారు.
వాళ్లు కూడా డబ్బులు జమ చేయడంతో ఆ డబ్బులు అన్ని తీసుకొని ముఖం చాటేశారు.చివరికి లాభాలు చూపిస్తాయనుకున్న యాప్ పని చేయకుండా పోయింది.దీంతో మోసపోయామని తెలుసుకున్న బాధితులు పోలీసులను ఆశ్రయించారు.అయితే ఇలాంటి వాటి పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు.