ఆస్ట్రేలియా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.సిక్కులు సాంప్రదాయంగా ధరించే కిర్పాన్పై పాఠశాలల్లో నిషేధం విధిస్తూ ఆస్ట్రేలియాలోని న్యూసౌత్ వేల్స్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఇటీవల ఓ పాఠశాలలో చోటు చేసుకున్న కత్తిపోటు సంఘటన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు న్యూసౌత్ వేల్స్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సారా మిచెల్ వెల్లడించారు.కొద్దిరోజుల క్రితం సిడ్నీలోని గ్లెన్వుడ్ హైస్కూల్లో 14 ఏళ్ల బాలుడు 16 ఏళ్ల మరో యువకుడిని కిర్పాన్తో పొడిచి చంపాడు.
కిర్పాన్ అనేది ఒక చిన్న వంగిన ఆకారంలో ఉండే కత్తి.ఆపత్కాలంలో ఇది తమను తాము రక్షించుకోవడంతో పాటు ప్రమాదంలో ఉన్నవారికి సహాయం చేయడం కోసం సిక్కులు ధరిస్తుంటారు.
ప్రస్తుతం సిక్కు సంతతికి చెందిన విద్యార్థులను న్యూసౌత్వేల్స్లోని పాఠశాలల్లో కిర్పాన్ తీసుకెళ్లడానికి అనుమతించే చట్టంలో లొసుగులు ఉన్నాయని మిచెల్ వెల్లడించారు.అందువల్ల చట్టసభల్లో ఈ అంశంపై మార్పులు తీసుకువచ్చే వరకు నిషేధం కొనసాగుతుందని ఆమె స్పష్టం చేశారు.
అయితే ప్రభుత్వం నిర్ణయంపై సిడ్నీలోని సిక్కు సమాజం ఆగ్రహం వ్యక్తం చేసింది.కిర్పాన్తో దాడి చేయడమనేది అత్యంత అరుదుగా జరుగుతుందని వారు తెలిపారు.
కాగా ఆస్ట్రేలియాలో సిక్కు మతం మైనారిటీ కేటగిరీలో వుంది.దేశ జనాభాలో సుమారు 0.5 శావతం మంది సిక్కు మతాన్ని అనుసరిస్తారు.ఆస్ట్రేలియాలో స్టిరపడిన భారత సంతతి ప్రజల్లో సిక్కు వర్గమే అతిపెద్దది.2016 జనాభా లెక్కల ప్రకారం.ఆస్ట్రేలియాలో 1,25,00 మంది సిక్కులు వున్నట్లు అంచనా.1996లో 12 వేలుగా వున్న సిక్కుల జనాభా.2001లో 17 వేలకు, 2006లో 26,500కు చేరింది.వీరిలో భారత ఉపఖండానికి చెందిన భారత్, బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్గనిస్తాన్ దేశాలకు చెందిన సిక్కులు వున్నారు.ఆస్ట్రేలియాలో పంజాబీ భాష 13వ స్థానంలో వుంది.సుమారు 1,00,000 అక్కడ పంజాబీ మాట్లాడతారని అంచనా.అలాగే ఆస్ట్రేలియాకు వచ్చే వలసదారులు మాట్లాడే భాషల్లో పంజాబీది మూడో స్థానం.81 శాతం మంది సిక్కులు, 13.3 శాతం హిందువులు, 1.4 శాతం మంది ముస్లింలు పంజాబీని మాట్లాడతారు.సిక్కుల ప్రాబల్యం దృష్ట్యా 1988లో ఆస్ట్రేలియా ప్రభుత్వం తొలిసారిగా వార్షిక సిక్కు క్రీడలను నిర్వహించింది.
దక్షిణ ఆస్ట్రేలియా, విక్టోరియా, సౌత్ వేల్స్ల నుంచి పెద్ద ఎత్తున సిక్కులు అడిలైడ్ చేరుకుని హాకీ తదితర క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.