మోసం చేయాలనే ఉద్దేశ్యం ఉన్నవానికి కనిపించే దారులు మోసపోయే వానికి కనిపించవు.అయినా ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా ఆన్లైన్ మోసాల విషయంలో కోడై కూస్తుంది.
పోలీసులు కూడా అపరిచితులు ఏ మార్గాల్లో తగిలిన చాలా జాగ్రత్తగా వ్యవహరించండని తెగ స్పీచ్లు ఇస్తున్నారు.కానీ జరిగే మోసాలు జరుగుతూనే ఉన్నాయి.
ఇకపోతే ఓ రెవెన్యూ ఉద్యోగి ఫేస్ బుక్ పరిచయం కారణంగా 10 లక్షలు పోగొట్టుకున్న ఉదంతం వెలుగు చూసింది.ఆ వివరాలు చూస్తే.ఖమ్మం జిల్లా కారేపల్లి తహసీల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న ఆంగోతు సుధీర్ కు నెల రోజుల క్రితం, ఫేస్ బుక్ లో, లండన్ కు చెందిన ఓ మహిళతో పరిచయం ఏర్పడింది.ఈ పరిచయం కాస్త హద్దులు మీరింది.
ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం తాను కస్టమ్స్ అధికారిని అని, మీకు లండన్ కు చెందిన మహిళ 50 వేల డాలర్లు పంపించారని కవిత శర్మ అనే పేరుతో సుధీర్ కు ఫోన్ వచ్చింది.ఇది నిజమని నమ్మిన సుధీర్ పలు దఫాలుగా 10 లక్షల 72 వేల రూపాయలు ఆమె పేర్కొన్న వివిధ ఖాతాల్లో జమ చేశారు.
కానీ ఎన్ని రోజులైన ఆ సొమ్ము రాకపోవడంతో అనుమానం వచ్చిన సుధీర్ తాను మోసపోయానని గుర్తించి పోలీసులను ఆశ్రయించాడు.ఈమేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.