తెలంగాణ లో కేసిఆర్ వదిలిన బాణంగా షర్మిలపై ప్రచారం జరుగుతోంది.టిఆర్ఎస్ కు మేలు చేసేందుకు షర్మిల తెలంగాణలో జగన్ సహకారంతో పార్టీ పెట్టారని , తెలంగాణ రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
కానీ దీనికి భిన్నంగా షర్మిల పదేపదే టిఆర్ఎస్ ప్రభుత్వం పై విమర్శలు చేస్తూ, తాను కెసిఆర్ వదిలిన బాణం కాదు అని నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.టిఆర్ఎస్, బిజెపి పైన విమర్శలు చేస్తూ , తెలంగాణలో కొత్త శక్తిగా ఎదుగుతున్నాము అనే సంకేతాలను ఇస్తున్నారు.
ఈ నెల 9వ తేదీన ఖమ్మం లో భారీ బహిరంగ సభ నిర్వహించ తలపెట్టారు.పార్టీ పేరును ప్రకటించే ఉద్దేశంతో భారీ ఎత్తున జన సమీకరణ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
అయితే ఇప్పుడు ఆ సభ నిర్వహణ పై అందరికీ అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి.
దీనికి కారణం కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో,ఈ సభ నిర్వహణ నిబంధన ప్రకారం సాధ్యమయ్యేలా కనిపించడం లేదు.
అందుకే జీవో నెంబర్ 68,69 ప్రకారం షర్మిల సభకు అనుమతులు రద్దు చేస్తున్నట్లు పోలీసులు నోటిసులు జారీ చేయడంతో, ఈ పరిస్థితి ఏర్పడింది.కరోనా తీవ్రత తెలంగాణలో పెరుగుతున్న నేపథ్యంలోనే, ఈ అనుమతులను రద్దు చేస్తున్నట్లు పోలీసులు ఆ నోటీసుల్లో పేర్కొనడంతో, తాము అన్ని రకాల ముందస్తు జాగ్రత్తలు తీసుకుని, ఈ సభ నిర్వహిస్తామని పోలీసులకు పార్టీ ప్రతినిధులు హామీ ఇచ్చినట్లు సమాచారం.
ఖమ్మంలోని పెవిలియన్ గ్రౌండ్స్ లో షర్మిల సభను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
ఇప్పటికే పోలీసుల నుంచి అనుమతి తీసుకోవడంతో ఇక ఏ ఇబ్బందులు ఉండవని అంతా భావించారు.కానీ తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో, ఒక్కసారిగా షర్మిల సభకు అనుమతి రద్దు చేస్తూ నిర్ణయం పోలీసులు తీసుకున్నారు.దీనిలో భాగంగానే త్వరలో ఏర్పాటు కాబోయే షర్మిల పార్టీ ఖమ్మం జిల్లా ఇంఛార్జి లక్కినేని సుధీర్ కి పోలీసులు నోటీసులు సైతం జారీ చేశారు.
అయితే ఇదంతా కేసీఆర్ ఆదేశాల తోనే జరుగుతోందని, తమ పార్టీ నిర్వహించబోయే సభ సక్సెస్ అయితే టీఆర్ఎస్ కు ఇబ్బందులు తప్పవు అనే ఉద్దేశంతో పోలీసుల ద్వారా ఈ నోటీసులు ఇప్పించారేమో అన్న అనుమానం సైతం షర్మిల పార్టీ నేతల్లో పెరుగుతోంది.