తెలంగాణా రాష్ట్రంలో కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం మంగళవారంతో ముగిసింది.ఏప్రిల్ 30న జరుగనున్న ఎలక్షన్స్ లో భాగంగా బుధవారం వరకు ప్రచారం కొనసాగించాల్సి ఉన్నా కరోనా తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల ప్రచార గడువు ఒకరోజు ముందుకు జరిపారు.
ఎన్నికల కమీషన్ నిర్ణయం మేరకు కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం ముగించారు.అధికార, ప్రతిపక్ష పార్టీలతో పాటుగా స్వతంత్ర అభ్యర్ధులు పోటాపోటీగా ప్రచారం చేశారు.
ఖమ్మం కార్పొరేషన్ లో 60 డివిజన్లకు ఎన్నికలు జరగాల్సి ఉండగా 10వ డివిజన్ టీ.ఆర్.ఎస్ అభ్యర్ధి చావా మాధురి ఏకగ్రీవంగా ఎన్నికవడంతో 59 డివిజన్లకే ఎన్నికలు జరుగనున్నాయి.ఇక ఖమ్మం కార్పొరేషన్ ఎలక్షన్స్ లో 252 మంది అభ్యర్ధులు పోటీ పడుతున్నారు.
టీ.ఆర్.ఎస్ తరపున పార్టీ ముఖ్య నేతలంగా ప్రచారంలో పాల్గొన్నారు.రవాణాశాఖా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్ని తానై ప్రచారంలో పాల్గొనగా మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వ రావు, ఎంపీ నాగేశ్వర రావు, మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, డీసీసీబి చైర్మన్ కూరాకుల నాగ భూషణం మిగతా ముఖ్య నేతలంగా ప్రచారంలో పాల్గొన్నారు.
అయితే అధికార పార్టీకు సమానంగా ప్రతిపక్ష పార్టీల ప్రచారం కూడా జరిగింది.కాంగ్రెస్, టీడీపీ, సీపీఎం కూటమి కూడా విసృత ప్రచారం చేసింది.సీఎల్పీనేత భట్టి విక్రమార్క ఖమ్మంలోనే ఉండి ప్రచారం చేశారు.సీపీఎం నుండి పోతినేని సుదర్శన్, నున్నా నాగేశ్వర రావు, టీడీపీ నుండి ఖమ్మం పార్లమెంట్ కమిటీ అధ్యక్షుడు కూరపాటి వెంకటేస్వర్లు ప్రచారంలో పాల్గొన్నారు.
ఇక ఈసారి ఖమ్మం కార్పొరేషన్ ఎలక్షన్స్ మీద బీజేపీ కూడా పట్టు సాధించాలని చూస్తుంది.పలు వార్డుల్లో పోటాపోటీగా ప్రచారం చేసింది.
రాష్ట్ర నాయకులతో ప్రచారం చేసి బీజేపీ కూడా ఈసారి గట్టి పోటీ ఇస్తుందని అనిపించేలా ప్రచార జోరు కొనసాగించింది.